కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగానో ప్రత్యేకంగా చెప్పన్కరలేదు.. అందుకే వారి సేవలకు గాను హైదరాబాద్ లో పూల వర్షం కురిపించారు. మరికొన్ని చోట్ల గౌరవ సత్కారాలు చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ విభాగానికి చెడ్డపేరు తెస్తున్నారు.
తాజాగా చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ వేసినట్లు మేసేజ్ రావడంతో ఆ కుటుంబం ఖంగు తిన్నది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరానికి చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల నుంచి హిందూపురంలో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం ఆ చనిపోయిన వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆయన కుమారుడి ఫోన్కు మెసేజ్ వచ్చింది. అదే ఫ్యామిలీలో మరో యువకుడు గతంలోనే సెకండ్ డోస్ టీకా వేయించుకున్నాడు. ఫస్ట్ డోస్ పూర్తి చేసుకున్నట్లు తాజాగా ఎస్.ఎం.ఎస్ వచ్చింది. ఇలా ఒకేరోజు తప్పుడు సందేశాలు రావడంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. కరోనా వ్యాక్సినేషన్ నమోదుపై ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
గ్రామ, వార్డు సచివాలయాల వారీగా టీకాలు వేస్తుండగా, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. కొందరు సిబ్బంది లక్ష్యాన్ని చేరుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్టు ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు సేకరించి టీకాలు వేయకుండానే వేసినట్టు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు కొవిన్ యాప్లో స్టోర్ చేస్తున్నారు. జిల్లాలో చాలామంది సెకండ్ డోస్ వేసుకోకుండానే వేసుకున్నట్లు సమాచారం వస్తోంది. దీనిపై వందల్లో కంప్లైంట్లు వస్తున్నా సాంకేతిక లోపం అని చెప్పి ఉన్నతాధికారులు ఎస్కేప్ అవుతున్నారు.