Udayagiri: రాజరికపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం ఉదయగిరి. విజయనగర సామ్రాజ్యంలోనూ.. ఒడిశా గజపతి రాజుల పాలనలోనూ ఈ ప్రాంతం ఎంతో గొప్పగా విరాజిల్లింది. నేడు రాజులు, రాజ్యాలు పోయినా.. ఉదయగిరి అన్న పేరులో గాంభీర్యం తగ్గలేదు. నాటి రాజుల రాజరికానికి సాక్ష్యాలుగా నిలిచే కోట.. పల్లవులు, చోళుల దైవ భక్తికి సాక్ష్యంగా నిలిచే గుళ్లు.. పలు పురాతన కట్టడాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో వజ్రవైఢూర్యాలు, బంగారు సంపద పుష్కలంగా ఉండేదని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతంలో వజ్రవైఢూర్యాలు, గుప్తనిధులు లభిస్తాయన్న కాంక్షలో ఇప్పటివరకు కొన్ని వేల తవ్వకాలు జరిగాయి. వజ్రవైఢూర్యాలు, గుప్తనిధుల సంగతి పక్కన పెడితే.. తాజాగా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో ఏకంగా బంగారు కొండే బయటపడింది.
ఉదయగిరి మండలం మాసాయి పేటలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు. బంగారంతో పాటు రాగి నిల్వలు కూడా ఉన్నట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఇక్కడి పరిసరాల్లోని ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలను అధికారులు సేకరించారు. మాసాయి పేట పరిసర ప్రాంతాల్లో 2వేల హెక్టార్లకు పైగా నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు. బంగారు నిక్షేపాలతో పాటు రాగి నిల్వలు నేల నుంచి 20-110 మీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. అధికారులు అక్కడ దొరికిన నిక్షేపాలను నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించారు. వింజమూరు మండలం గరిమెన పెంట పరిసర ప్రాంతాల్లోనూ రాగినిల్వలు బయటపడ్డాయి. లాబ్లో వీటిపై పలు పరీక్షలు, పరిశోధల అనంతరం ఏ మేరకు నిల్వలు లభిస్తాయో ఫైనల్ చేయనున్నారు.
మరో కేజీఎఫ్గా ఉదయగిరి..‘‘కేజీఎఫ్’’ అన్నది సినిమా పేరుగా ఇప్పుడు ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, సినిమాకంటే కొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఈ ప్రాంతం చాలా ఫేమస్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే తెలియనివారుండరు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరున్న బంగారు గనులివి. ఇక్కడినుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడికో బంగారం సరఫరా అయ్యేది. కానీ, నిల్వల కొరత, ఉత్పత్తిలో నష్టాల కారణంగా ప్రభుత్వం వీటిని మూసేసింది. అయితే, ఇప్పుడు ఉదయగిరిలో బయటపడ్డ బంగారు నిల్వలను చూస్తుంటే.. ఉదయగిరి మరో కేజీఎఫ్గా మారబోతోందా అన్న చర్చ జరుగుతోంది. ల్యాబ్ ఫైనల్ రిపోర్టు తర్వాత ఉదయగిరిలో బంగారు తవ్వకాలు మొదలుపెడితే ఉదయగిరి కాస్తా.. ఉదయగిరి గోల్డ్ ఫీల్డ్స్గా(UGF)మారనుంది. కేజీఎఫ్ చరిత్ర 1880లలో మొదలై తక్కువ టెక్నాలజీ అందుబాటులో ఉన్న సమయంలోనే ఉత్పత్తి నిలిచిపోయింది. ఇది 2022 కాలం.. ఇప్పుడున్న టెక్నాలజీ ఎటువంటి పనినైనా సుసాధ్యం చేస్తోంది. ఇలాంటి టైంలో తవ్వకాలు మొదలైతే ఉత్పత్తి మామూలుగా ఉండదు. అక్కడ ఉన్న నిల్వలను బట్టి ప్రపంచానికే బంగారం సరఫరా చేసే స్థాయికి దేశం ఎదిగే అవకాశం ఉంది. దేశంలో బంగారం ఉత్పత్తి పెరిగితే.. ధర తగ్గి సామాన్యులకు సైతం బంగారం కారు చౌకగా అందుబాటులోకి వస్తుంది. యూజీఎఫ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారం మయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి, UGFపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nellore: నెల్లూరు జిల్లాలో బంగారు, రాగి నిక్షేపాలను గుర్తించిన అధికారులు!