ప్రపంచంలో క్రికెట్ ఆటకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గ్రౌండ్ నుంచి గల్లీ సందుల్లో వరకు క్రికెట్ ఆట ఆడేవారు రోజూ కనిపిస్తూనే ఉంటారు. కొంత మంది అయితే క్రికెట్ తమ ఊపిరిగా జీవిస్తుంటారు. మన టీమ్ ఇండియాలో గల్లీ క్రికెట్ ఆడిన వారు స్టార్ క్రికెటర్స్ గా పేరు సంపాదించుకున్నారు. సత్తా ఉంటే ఎవరికైనా క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకోవొచ్చు అన్న విషయం ఎన్నోసార్లు రుజువైంది.
తాజాగా అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎమ్మిగనూరుకు చెందిన విద్యార్థి కె.మహబుబ్బాషా ఎంపికయ్యాడు. ప్రస్తుతం కె.మహబుబ్బాషా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆటపై మోజు పెంచుకున్న మహబూబ్ బాషా క్రికెట్లో తన ప్రతిభ చూపి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. నాగపూర్లో గత నెల 27 నుంచి ఈనెల 12వ తేదీ వరకు అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో మహబుబ్బాషా అత్యుత్తమ ప్రదర్శన కనిపించాడు.
దుబాయ్లో డిసెంబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న క్రికెట్ పోటీల్లో అండర్ 19 ఇండియా జట్టు తరఫున ఈ విద్యార్థి ఆడనున్నాడు. అయితే అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టు లో స్థానం సంపాదించినందుకు పలువురు అభినందించారు.