వైసీసీ రెబెల్ లీడర్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ని హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. సీఎం జగన్కు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల జగన్ బెయిల్ను రద్దు చేయలేమంటూ ఉత్తర్వులు ఇస్తూ.. రఘురామ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు జగన్ షరతులను ఉల్లంఘించిన సంఘటక ఒక్కటి కూడా చోటు చేసుకోలేదని తెలిపింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. సాక్షులను ప్రభావితం చేస్తున్నందున ఆయనకు మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలని రఘురామ సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
కానీ సీబీఐ కోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడంతో.. ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘జగన్ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలకు గురైన సాక్షుల వివరాలను వెల్లడించలేదు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి.. సహ నిందితులకు కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేయడం.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారు అన్న కారణాలు వల్ల జగన్ బెయిలు రద్దు చేయమని కోరడం సరైంది కాదు. ఇప్పటికే బెయిలు రద్దు పిటిషన్ని సీబీఐ కోర్టు 2021, సెప్టెంబర్ 15న కొట్టివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవు. అందువల్ల బెయిల్ రద్దు చేయమని కోరుతున్న మీ పిటిషన్ను కొట్టివేస్తున్నాం. బెయిల్ రద్దు చేయలేం’’ అని కోర్టు తెలిపింది.