‘ఖాళీ సమయంలో పార్ట్టైమ్గా ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేయండి.. భారీగా సంపాదించే అవకాశం ఉంది’.. అని కేటుగాళ్లు పెద్ద ఎత్తున యువతకు వల వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సైబర్ కేటుగాళ్లు వివిధ రకాలగా సామాన్యులను మభ్యపెట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఉద్యోగం, అధిక డబ్బు కావాలనే ఆశలతో ఉన్న యువత బలహీనతు ఆసరాగా చేసుకుని సైబర్ దొంగలు వల వేస్తున్నారు. అంతేకాక ఈ కేటు గాళ్లు ఇచ్చే ప్రకటనలను నిజమని నమ్మి పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు డబ్బులు పొగొట్టుకుని విలవిల్లాడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ యువతి కూడా లక్షల్లో డబ్బు పోగొట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
విజయవాడకి చెందిన ఓ యువతి ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె ఫోన్ కు సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూ అధిక డబ్బులు సంపాదించవచ్చని.. వివరాలకు సంప్రదించండి అని ఫోన్ నెంబర్ రాసి ఉంది. సదరు యువతి.. ఆ నెంబరుకు కాల్ చేయగా.. యూట్యూబ్లో వీడియోలను లైక్ చేస్తే చాలని, డబ్బులు బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తామని నమ్మించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు ఇది కూడా చేస్తే.. అధిక మొత్తంలో సంపాదించవచ్చని ఆమె ఆశ పడింది.
తన బ్యాంకు ఖాతా వివరాలను సదరు వ్యక్తులకు ఇచ్చింది. అనంతరం మూడు వీడియోలు లైక్ చేసినందుకు ఆమె ఖాతాలో రూ.150 జమ అయింది. మరో ఆరు వీడియోలను లైక్ చేస్తే.. రూ.300 ఖాతాలో వేశారు. అలా ఆమెకు నమ్మకం కుదిరేలా చేశారు. ప్రీపెయిడ్ టాస్కులు చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని సైబర్ కేటుగాళ్లు నమ్మించారు. అలా తొలుత ఆ యువతి రూ.1000 చెల్లించగా రూ.1,600 తిరిగి వచ్చాయి. ఇలా ఆమె విడతల వారీగా రూ.19 లక్షలు సైబర్ కేటుగాళ్ల బ్యాంకు అకౌంట్ కు బదిలీ చేసింది.
ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత లాభం వస్తుందని చూపిన డబ్బులను డ్రా చేసే అవకాశం లేకపోయింది. దీంతో ఆమె వారికి ఫోన్ చేసి నిలదీసింది. ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే రూ.12.95 లక్షలు కట్టాలని తేల్చిచెప్పారు. అలా చేయకుంటే కట్టిన డబ్బు కూడా తిరిగి రాదని మోసగాళ్లు చెప్పారు. అప్పటికే కట్టిన రూ.19 లక్షలు వచ్చే అవకాశాలు లేవని, మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి ఘటనలు నిత్యం చూస్తూ కూడా ఇంకా మోసపోతున్నారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి