సాధారణంగా ఎవరైన పాము కనిపిస్తే వెంటాడి మరీ కర్రలతో కొట్టి చంపేస్తుంటారు. కానీ కొందరు మాత్రం వాటిని పట్టుకుని దూర ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. అయితే ఎవరైన తనను కాటేసిన పాము దొరికితే చంపకుండా వదిలేస్తారా? పాము ప్రాణం పోయేంత వరకు కొట్టి కొట్టి చంపుతారు. అయితే కొందరు మాత్రం జీవులపై ఉన్న ప్రేమతో తమకు అపాయం తలపెట్టిన కూడ వదిలేస్తారు. అలానే ఓ పురోహితుడు తనను రెండు సార్లు కాటేసిన పామును చంపకుండా వదిలేశాడు. కానీ చివరకు ఆ పాము కాటుకే ఆ పూజారి బలయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కృష్ణా జిల్లా కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బ గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు(48) పౌరోహిత్యం, వాస్తుశాస్త్రం చెబుతూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు పాములను పట్టే నైపుణ్యం కూడా ఉంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం పీతలావ అనే గ్రామంలోని ఓ రొయ్యల మేత షెడ్డులో పాము ఉందన్న స్థానికుల సమాచారంతో నాగాబాబు అక్కడి వెళ్లారు. నాగబాబు ఆ తాచు పామును పట్టుకున్నారు. అయితే ఆ పట్టుకునే ఈక్రమంలో ఆయన చేతిపై రెండు సార్లు ఆ పాము కాటు వేసింది. అయినప్పటికీ ఆ పామును ఏం చేయకుండా ఊరికి దూరంగా సురక్షిత ప్రాంతంలో వదిలేశాడు. అనంతరం ప్రాథమికి చికిత్సలో భాగంగా తనకు తెలిసిన వైద్యం చేసుకుని వెంటనే మచిలీపట్నంలోని ఆస్పత్రికి వెళ్లారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు.
పాము కాటేసినా..దానికి ఎటువంటి హాని తలపెట్టకుండా వదిలేయడం అనేది ఆయనకు మూగజీవాలపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగబాబు, ఆయన తండ్రి పౌరోహిత్యం చేసుకుంటూ పాము, తేలు కాటుకు నాటు వైద్యం చేసేవారు. ఎవరి దగ్గర డబ్బులు కూడా తీసుకోకుండా ఈ విషజీవుల కాటుకు విరుగుడు వేస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పాము కాటుకే ఆయన మృతి చెందడంతో గ్రామంలో విషాదం నింపింది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.