తిరుమల ఆలయ డ్రోన్ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం కూడా ఆలయంపై డ్రోన్లు, విమానాలు ఎగరవేయడానికి వీలు లేదని తెలిపారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అసలు ఆ దృశ్యాలు నిజమైనవేనా? ప్రస్తుతానివేనా? అనే అంశాలను తెలుసుకునేందుకు ఫారెన్సిక్ విభాగానికి పంపడం జరిగింది. మరోవైపు తిరుమల ఆలయ డ్రోన్ దృశ్యాలను వైరల్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు. బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామంటూ టీటీడీ ఛైర్మన్ హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అవి ఒరిజనల్ దశ్యాలా లేక పాత ఫొటోల ద్వారా వీడియో రూపొందించారా అనే అంశాలు తెలుసుకునేందుకు ఫారెన్సిక్ పంపామన్నారు. మరోవైపు ఈ ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను వైరల్ కావడంపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టీటీడీ చేసిన ఫిర్యాదుతో తిరుమల ఒకటో పట్టణ పోలీసులు ఐకాన్ అనే సంస్థకు చెందిన కిరణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 447, ఆలయ భద్రతా నిబంధన ఉల్లంఘన, అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కిరణ్ హైదరాబాద్ లో ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. టీటీడీ చర్యలు మొదలు పెట్టింది. తిరుమల శ్రీవారి దేవాలయ భద్రతా వలయంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని వినియోగించేందుకు పరిశీలన చేస్తోంది. ఆలయ భద్రతా నిబంధనలు ఉల్లంఘించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్ నెలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వే కోసం టీటీడీ ఓ ప్రైవేట్ సంస్థకు క్రాంట్రాక్ట్ ఇచ్చింది. అందులో భాగంగా డ్రోన్లతో సర్వే నిర్వహించారు. అయితే ఆ సమయంలో కొందరు కావాలనే డ్రోన్ల సాయంతో ఆలయం దృశ్యాలను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. ఆస్థాన మండపం సమీపంలోని రోడ్డు పైనుంచి డ్రోన్లను ఎగరవేసినట్లు చెబుతున్నారు. అక్కడి నుంచే ఆలయ దృశ్యాలను రికార్డు చేశారంటున్నారు. ఎవరైనా బాధ్యులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని టీటీడీ స్పష్టం చేసింది. మరో రెండ్రోజుల్లో ఈ ఘటనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.