ఏపీ సీఎం జగన్ పై విపక్షం టీడీపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పలు అంశాల్లో.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివేకా హత్య విషయంలో మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ పాలనలో ఆడవారికి ఎలాంటి ప్రాధాన్యత లేదని.. సీఎం తన సొంత మనుషులను కూడా మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
జగన్ జైలులో ఉండగా.. షర్మిల తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నికల ప్రచారం చేస్తే… అధికారంలోకి వచ్చాక ఒక్క పదవి కూడా ఇవ్వకుండా ఆమెకు ద్రోహం చేశారని అనిత ఆరోపించారు. విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకుని, కన్నీళ్లు పెట్టుకుని ప్రచారం చేస్తే.. ఆమెను జగన్ తన అనుమతి లేకుండా ఏపీలో అడుగు పెట్టకుండా చేశారని అనిత ఆరోపించారు.
సొంత చెల్లిని, తల్లిని మోసం చేసిన జగన్ రెడ్డి సొంత భార్యను మోసం చేయడని గ్యారంటీ ఏంటంటూ అనిత ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తులు భారతి రెడ్డి పేరు మీదే ఉన్నాయని.. కేసులన్నీ ఆమె మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా.. సాక్షిలో తప్పు రాశారన్న జగన్ ఏదైనా విషయంలో భారతి రెడ్డిని బలిచేయడు అని నమ్మకమేంటని అనిత ప్రశ్నించారు. జగన్ విషయంలో భారతి అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ఏదో ఒక రోజు ఆమె కూడా ఆయన బాధితుల జాబితాలో చేరటం ఖాయమని అనిత జోస్యం చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.