ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాల అభివృద్ది కోసం 15వ ఆర్థిక సంఘం పంచాయితీలకు ఇచ్చిన నిధులను అధికార వైసిపి ప్రభుత్వం ఇతర అవసరాలకోసం మళ్లించడం దారుణమని నారా లోకేష్ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తే గ్రామాల రూపు రేఖలు మారుస్తానన్న సీఎం జగన్.. ఇప్పుడు ఏకంగా పంచాయతీల ఖాతాల్లో ఉన్న సొమ్మును కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చేంత వరకు ఓ మాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక వారి నిజస్వరూపాలను బయట పెడుతున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ పలు వ్యవస్థల విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నామన్నారు. గతంలో 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేసారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమే ఆవేదన వ్యక్తం చేశారు.
15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సమయంలో… ఖాతాల నుంచి సొమ్మును తీసేసుకుంటే వారు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం మళ్లించిన సొమ్ముని పంచాయతీల ఖాతాల్లో వెయ్యాలి అని లోకేష్ డిమాండ్ చేసారు.