ఏపీలో అభివృద్ధి కుంటుపడుతుంది.. పరిశ్రమలు ఏవి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు.. ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిన పరిశ్రమలు వెనక్కు వెళ్లాయి… రాష్ట్రం అప్పులపాయ్యింది.. రోజు ఉదయం లేచింది మొదలు.. రాత్రి వరకు ప్రతిపక్షాలు పదే పదే వల్లేవేసే మాటలు ఇవే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ.. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నప్పటికి కూడా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం ఆపడం లేదు. ఇక సంక్షేమ పథకాల అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నివేదికల ప్రకారం.. ఈ ఏడాది 7 నెలల వ్యవధిలోనే ఏపీ దేశవ్యాప్తంగా వచ్చిన పారిశ్రామిక పెట్టుబడుల్లో దాదాపు 45 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అలానే తాజాగా రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఆర్ధికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. జీడీపీలో మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను ఏపీ దాటేసింది.
ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వ పారిశ్రమిక విధానంపై.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రముఖ సంస్థ టాటాసన్స్ ప్రశంసలు కురిపించింది. ఏపీ పారిశ్రామిక విధానం పెట్టుబడులకు దన్నుగా ఉందని.. ఆ సంస్థ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ కొనియాడారు. రాష్ట్రంలో టాటా సన్స్ గ్రూప్ పెట్టుబడులకు సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టాటా సన్స్ చైర్మన్ సీఎం జగన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సీఎం జగన్ తమ ప్రభుత్వం అవలంభిస్తున్న పారదర్శక పారిశ్రామిక విధానం గురించి వివరించారు. భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమైన మానవ వనరులకు, మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
టాటా సన్స్ గ్రూపు పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని జగన్ హామీ ఇచ్చారు. అత్యధిక జీఎస్డీపీ సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇప్పటికే సెజ్ ల్లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్కు సీఎం జగన్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ర్యాంక్ సాధించడం కోసం అవాలంభించిన నూతన పారిశ్రమిక విధానాలను సీఎం జగన్ ఈ సందర్భంగా వివరించారు. ఉత్తమ పారిశ్రమిక విధానం వల్ల అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు రాష్ట్రానికి వచ్చేందుకు సముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే కలను సాకారం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని టాటా సన్స్ చైర్మన్ అన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికాభివృద్ధి పథంలో నడిపిస్తోన్న సీఎం జగన్ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజయండి.