ఎపిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్క్యాప్) గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్క్యాప్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో జులై మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా నెలవారీ వాయిదాలు కట్టేలా వాహనాల తయారీ సంస్థలతో నెడ్క్యాప్ ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో సుమారు 80 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనానికి రోజుకు సగటున అర లీటరు పెట్రోలు వంతున వాడినా, 40 లక్షల లీటర్లు అవసరం అవుతుంది. వీటివల్ల వెలువడుతున్న కాలుష్యం, కర్బన ఉద్గారాలను కొంతైనా తగ్గించడానికి విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని నెడ్క్యాప్ భావిస్తోంది. నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. మూడు సంవత్సరాల పాటు వాహనాల నిర్వహణ బాధ్యత కూడా తయారీ సంస్థదే. ఒక్కో కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుందని నెడ్క్యాప్ ఎండీ రమణారెడ్డి తెలిపారు. బండి వేగాన్ని బట్టి గరిష్ఠంగా రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు సబ్సిడీ వస్తుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ రాయితీ సొమ్ము చెల్లిస్తుంది. వెహికల్ టెస్టింగ్ ల్యాబ్ ఆమోదించిన నమూనాలను పరిశీలించి రాష్ట్రంలో విక్రయానికి పలు సంస్థలకు కేంద్రం ఆమోదం తెలిపింది. విద్యుత్ వాహనానికి ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే మూడు యూనిట్లు ఖర్చవుతుంది. సుమారు 100 కి.మీ ప్రయాణించవచ్చు. ఇంట్లోనే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పెట్రోలుకు వెచ్చించే మొత్తానికి ఇంకొంత కలిపితే నెలవాయిదా సరిపోతుంది’అనిఅధికారులు చెబుతున్నారు