మానవ మేథస్సు, సృజనాత్మకత కలగలసిన నిర్మాణాలు, సహజసిద్ధంగా ఏర్పడినవి, మన సాంస్కృతిక మూలాలకు ప్రతిరూపంగా ఉండేవి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందుతాయి. ఈ నేపధ్యంలో సింహగిరి వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోని శిల్పాలు, శాసనాలకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు. సంబంధిత ప్రదేశానికి చారిత్రక ప్రాముఖ్యం ఉందనే విషయం తెలియగానే దాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. యుద్ధంలాంటి సమయాలలో ఈ వారసత్వ సంపదల జోలికి సైన్యం రాదు.
వీటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డిని కోరారు. చారిత్రక శిల్పకళా సౌందర్యం సింహాచలం ఆలయానికి ఉందని ఈవో వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, పురాతన పుస్తకాలు, ఫొటోలను వీసీకి చూపించారు. 11వ శతాబ్దం నుంచి తరతరాల సంస్కృతికి అద్దంపట్టేలా సింహాచలం దేవస్థానంలో శిల్పాలు ఉన్నాయని, శ్రీకృష్ణ దేవరాయలు నుంచి గజపతుల వరకు ఉన్న రాజశాసనాలు చరిత్రకు అద్దం పడుతున్నాయని వివరించారు.
అన్ని శిల్పాలను ప్రత్యేక తైలంతో శుభ్రపరిచినట్టు చెప్పారు. భక్తులకు అర్థమయ్యేలా బోర్డులను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏయూ సహకారం అందిస్తే సింహాచలం ఆలయ విశిష్టతను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తాయన్నారు. ఆలయ శాసనాలను అధ్యయనం చేసి అన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వీసీ ప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు.
నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే సింహాచలం దేవస్థానంపై పూర్తిస్థాయి పరిశీలన చేయిస్తామన్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా ఆమోదిస్తే ఆక్రమణలు, పారిశ్రామికీకరణ, ఇష్టారాజ్యంగా ఆ ప్రదేశాన్ని వాడేయడం తదితర అనర్థాలనుంచి రక్షణ పొందుతాయి. ఈ ప్రాంతాలను సైన్యం అవసరాలకు వినియోగించుకోవడానికి కుదరదు. కళలు, సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యం ప్రాముఖ్యాన్ని గుర్తించడం, సరిహద్దులను, రాజకీయభేదాలను చెరిపివేసేందుకు ఈ గుర్తింపు ఉపయోగపడుతుంది.