ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాక మంత్రి అంబటి రాంబాబు మీద కొందరు సంచలన ఆరోపణలు చేశారు. కుమారుడు చనిపోయినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారంటూ ఇద్దరు భార్యాభర్తలు ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకు బాధితులు ఎవరు.. ప్రభుత్వం ఎందుకు వారికి పరిహారం అందించింది వంటి వివరాలు..
ఈ ఏడాది ఆగస్టు నెల 20వ తేదీన సత్తెనపల్లి పట్టణంలోని ఓ రెస్టారెంట్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో వడ్డెర కులానికి చెందిన తురకా అనిల్.. అనే వ్యక్తికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందింది. అనిల్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారం చెక్కు రూపంలో వచ్చింది. ఈ ఐదు లక్షల్లో నుంచి రెండున్నర లక్షల రూపాయలు తమకు ఇవ్వాలని సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ భర్త సాంబశివరావు డిమాండ్ చేసినట్లుగా బాధితులు తాజాగా వెల్లడించారు.
ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి స్థానికంగా ఉన్న ఓ నేత సాయంతో మంత్రి అంబటి రాంబాబును కలిశామన్నారు బాధితులు. అయితే, మంత్రి కూడా పరిహారం చెక్కులో తనకు రెండు లక్షలు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.