తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు బుధవారం.. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తోపులాట జరగడం.. తొక్కిసలాట కారణంగా.. 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన పట్ల చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుపుతున్నారు. ప్రమాదం కారణంగా చంద్రబాబు సభను ముగించి.. ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి అసలు కారణాలు ఏంటి.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదా.. జనాలు భారీగా తరలి వచ్చారా.. లేక ఇరుకు సందులో సభ నిర్వహించడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
చంద్రబాబు నాయుడు.. కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ రోడ్డు వైశాల్యం.. అరవై అడుగులు కూడా లేదని తెలుస్తోంది. ఉన్న తక్కువ ప్రాంతంలోనే.. కొందరు దుకాణాదారులు.. రోడ్డును కొంతమేర ఆక్రమించారు. దీనికి తోడు.. రోడ్డుకు అటువైపు, ఇటువైపు డ్రైనేజీ గుంతలు ఉన్నాయి. ఇక సభ నేపథ్యంలో.. టీడీపీ నాయకులు.. ఆ ఇరుకు ప్రాంతంలోనే.. రోడ్డుకు ఇరువైపులా చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు కట్టారు. అక్కడే మరోపక్క.. టూవీలర్స్ పార్క్ చేశారు. దాంతో.. రోడ్డు వైశాల్యం మరింత కుంచించుకుపోయింది.
అధినేత దృష్టిలో పడేందుకు.. కందుకూరు టీడీపీ నేతలు.. పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, సభకు వచ్చిన వారి టూవీలర్స్ని కూడా సభ జరిగే ప్రాంతంలోనే.. రోడ్డు పక్కనే పార్క్ చేయడంతో.. మరింత ఇరుకుగా మారింది. అంతేకాక.. కేవలం నాలుగు వేల మంది మాత్రమే.. పట్టే రోడ్డులోకి ఎక్కువ మంది జనం రావడంతో ఈ ఘటన జరిగింది అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.
రోడ్డు చిన్నది కావడం, అధినేత చంద్రబాబును దగ్గర నుంచి చూడాలనే ఉత్సాహంతో.. జనాలు ముందుకు వెళ్లే ప్రయత్నంలో.. తొక్కిసలాట జరిగి.. మురుగు కాల్వలో పడ్డారు. ఇది గమనించిన వెంటనే అక్కడున్న వారు అలర్ట్ అయ్యారు. తమకు ఏం కాకూడదని ఆలోచించారే తప్ప.. కింద పడ్డ వారికి సాయం చేద్దామని ఎవ్వరు అనుకోలేదు. దాంతో తమను తాము కాపాడుకోవడం కోసం.. జనాలు అందరూ అటువైపు నుంచి పక్కకు పరుగులు తీయడంతో.. ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలపుతున్నారు. తొక్కిసలాట కారణంగా ప్రమాద స్థాయి పెరిగింది. ఈ తొక్కిసలాటలో కొందరు అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తోంది.
ఇక బహిరంగ ప్రదేశాల్లో సభలను ఏర్పాటు చేస్తే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోవు అంటున్నారు స్థానికులు. కానీ నేతలు.. రోడ్ షో అని చెప్పి.. రోడ్డుపైనే సభలు పెట్టడం, ఎక్కువ మంది జనాలు వచ్చినట్లు కెమరాల్లో కనిపించడం కోసం ఇరుకుసందులను ఎంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే కందుకూరులో ప్రమాదానికి ప్రధాన కారణంగా మారిందని కందుకూరు స్థానికులు చెబుతున్నారు.
ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. విజయ (ఉలవపాడు), దేవినేని రవీంద్ర (ఆత్మకూరు), కకుమను రాజా(కందుకూరు) కలవకూరి యానాది (కందుకూరు), మర్లపాటి చిన కొండయ్య (గుండ్లపాలెం), పురుషోత్తం(కందుకూరు) గా గుర్తించారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరిపరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక మృతి చెందిన వారి కుటుంబాలకు.. చంద్రబాబు నాయుడు పది లక్షల రూపాయలు ప్రకటించారు. నేతలు.. ప్రచారం కోసం ఇలాంటి ఇరుకు సందుల్లో సభలు పెట్టవద్దని స్థానికులు కోరుకుంటున్నారు. ఇరుకు సందులో సభ నిర్వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మీరు భావిస్తున్నారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.