జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. ఆయన స్పీడ్ పెంచారు. కొన్ని రోజుల క్రితం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మీరు కోరుకుంటే సీఎం అవుతాను.. అధికార పార్టీని గెలవనీయను అంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈ సారి ఏపీ రాజకీయాల్లో పవర్ స్టార్ తన సత్తా చూపుతారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అంతేకాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం కోసం.. పవన్ కళ్యాణ్.. తన ఎన్నికల రథం వారాహిని సిద్ధం చేశారు. అంతేకాక.. ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయడమే కాక.. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు పవన్ కల్యాణ్ నడుం బిగించిన సంగతి తెలిసిందే.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరమార్శించి.. వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నారు పవన్ కళ్యాణ్. రైతులకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన పరిహారం కోసం పోరాడుతూనే.. తన వంతుగా వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తామని గతంలోనే పవన్ ప్రకటించారు. దానిలో భాగంగా.. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన 150 మంది రైతుల కుటుంబాలకు.. పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు ప్రకటించారు. వీరిలో చాలా మందికి ఇప్పటికే సాయం అందించారు.
అయితే.. పవన్ కౌలు రైతులకు చేస్తున్న ఆర్థిక సాయం గురించి నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ తన కుమారుడు అకీరా నందన్ కోసం దాచిన డబ్బులను కౌలు రైతులకు పంచుతున్నారంటూ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. పవన్, కౌలు రైతులకు అందించే సాయం గురించి కీలక విషయాలు వెల్లడించారు.
‘‘మేం ఎవర్ని దోచుకోవడం లేదు.. దాచుకోవడం లేదు.. పంచుకోవడం లేదు. కనీసం అధికారంలో కూడా లేము. పవన్ కళ్యాణ్ చాలా నిజాయతీపరుడైన నాయకుడు. తనదగ్గరున్న ప్రతి రూపాయని ఆయన ఎంతో కష్టపడి సంపాదించారు. ఆఖరికి తన కుమారుడు.. అకీరా కోసం దాచిన డబ్బును కూడా.. కౌలు రైతులకు ఆర్థికసాయం చేయడానికి అందిస్తున్నాడు. ఈ విషయాన్ని గతంలో.. నాగబాబు కూడా ప్రస్తావించి కన్నీరు పెట్టుకున్నారు. కొడుకు గురించి కూడా ఆలోచించకుండా.. రైతన్నల కోసం పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు’’ అని చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్
‘‘ఓసారి పవన్ కళ్యాణ్ రూ.9 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. అప్పుడు ఆయన దగ్గర ఆ డబ్బులు లేకపోతే.. వేరే వాళ్లను అడిగి.. ట్యాక్స్ కట్టారు. తను ఇబ్బందులు పడుతూ కూడా పవన్.. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తున్నారు. 2019 ఎన్నికల వేళ.. జగన్.. ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు తనకు అవకాశం ఇచ్చారు. కానీ.. 2024లో.. ప్రజలు అదే ఒక్క ఛాన్స్ను పవన్ కళ్యాణ్కు ఇవ్వబోతున్నారు. ఏపీ ప్రజలు ఏంతో వారు. ముఖ్యంగా మహిళలు, యువత పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉండి.. ఆయన వెంటే నడుస్తారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. 2024లో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఏపీ సీఎం అవుతారు’’ అని పృథ్వీరాజ్ ధీమా వ్యక్తం చేశాడు. మరి కొడుకు భవిష్యత్తు కన్నా కూడా అన్నదాతలను ఆదుకోవడమే ముఖ్యమని భావించిన పవన్ కళ్యాణ్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలుస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.