దేశ ప్రధమ పౌరురాలు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము.. పోరంకిలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ.. సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు.
ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని తెలిపిన ముర్ము.. అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని తెలిపారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని పలికిన రాష్ట్రపతి.. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ తెలుగులో మాట్లాడారు. “మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉంది. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు నా ప్రార్థనను తప్పక నెరవేరుస్తారు. కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. కన్కాశుల్కం లాంటి గొప్ప నాటకాలకు ఏపీ చిరునామాగా నిలిచింది. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఏపీ నుంచే వచ్చారు. సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
దేశచరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. రాష్ట్రపతి పదవిలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్మును గౌరవించుకోవడం మనందరి బాధ్యతగా భావించి పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒరిస్సాలో ఒక మారు మూల గిరిజన తెగలో జన్మించిన ఆమె ఆ ప్రాంతంలోనే తొలి డిగ్రీ పట్టాను అందుకున్నారన్నారు. జార్ఖండ్ గవర్నర్గా తరువాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారన్నారు. ఆమెలా మహిళలు స్వయం సమృద్ది సాధించాలని.. ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతి పదవికి ద్రౌపదీ ముర్ము మరింత వన్నె తెస్తారని భావిస్తున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.