పదిహేనేళ్ల వయసు.. తెలిసీతెలియని తనం.. అమ్మానాన్న హాస్టల్లో చేర్పిస్తున్నారన్న కోపం.. ఆ కుర్రాడిని ఇంటి నుంచి పారిపోయేలా చేసింది. ఏళ్లకు ఏళ్లు గడిచినా కుమారుడు తల్లిదండ్రు వద్దకు వెళ్లలేదు. అమ్మతో మాట్లాడాలని ఆ బిడ్డకూ అనిపించలేదు. కానీ అతని తల్లిదండ్రులకు మాత్రం తమ బిడ్డను చూడాలని ఎదురుస్తున్నారు. ఐదేళ్ల పాటు సాగిన ఈ ఎడబాటుకు ఆధార్ కార్డు ముగింపు పలికింది. తల్లీబిడ్డల మధ్య ఏర్పడిన ఎడబాటును దూరం చేసి వారిని కలిపింది.
వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన బైపోతు తవిటినాయుడు, రాజేశ్వరి దంపతుల ఏకైక కుమారుడు హరి ప్రకాష్. అతను 2016లో హాస్టల్లో చేర్పించారు. అయితే హరికి అక్కడ చదవడం ఇష్టం లేక చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ పెట్రోల్ బంకులో పనికి కుదిరాడు. ఈ ఐదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా ఇంటికి ఫోన్ కూడా చేయలేదు. అతనికి అమ్మనాన్నల మీద ప్రేమలేకున్న వారు మాత్రం అతడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.అయిన లాభంలేక పోయింది.
హైదరాబాద్ లో పనిచేస్తున్న హరికి ఇటీవల ఆ బంకులో క్యాషియర్గా పదోన్నతి పొందాడు. బంకులో పనికోసం ఫోన్ కు సిమ్కార్డు కొనుగోలు చేయాలకున్నాడు. ఈ సిమ్ కు ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నూతన ఆధార్ కార్డు తన పాత ఆధార్ కార్డుకు అనుసంధానం చేసి ఉండడంతో స్వగ్రామమైన పెద్ద లక్ష్మీపురంలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి కొత్త కార్డు వచ్చింది. ఊహించని విధంగా కుమారుడి పేరిట ఆధార్ కార్డు ఇంటికి రావడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులను సంప్రదించారు. కోపంతో వెళ్లిపోయిన హరిప్రకాష్ హైదరాబాద్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించి ..ఆయనను స్వగ్రామం తీసుకువచ్చి తల్లితండ్రులతో కలిపారు. ఐదేళ్ల తర్వాత కొడుకును చూసిన తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.