కొత్త రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. ఆంధ్ర ప్రదేశ్(ఏపీ) రాజధాని ఏది అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. 2014 రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ న్యాయపరమైన అంశాల దృష్ట్యా ఇటీవల మూడు రాజధానులను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో అస్పష్టత నెలకొంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర సంఘటన చక్కర్లు కొడుతోంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించిన ఇండియా మ్యాప్ నుంచి ఏపీ రాజధాని మాయమైంది.
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21కి కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించింది. పాఠ్యపుస్తకాల పరిమాణం తక్కువగా ఉండేందుకు మూడు సెమిస్టర్లుగా విభజించి ముద్రించారు. రెండో సెమిస్టర్ పాఠ్య పుస్తకం చివరిలో ఇండియా మ్యాప్ను ముద్రించారు. ఈ మ్యాప్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కేవలం ఏపీ అని చూపించి వదిలేశారు. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇచ్చి ఏపీ విషయంలో మాత్రం కేవలం రాష్ట్రం పేరు చెప్పి వదిలేయడంపై ఉపాధ్యాయులు, విద్యావంతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ మ్యాప్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటప్పుడు ఏపీ రాజధాని గురించి ఏం చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.