ఏపీ అసెంబ్లీలో వైసీపీ లీడర్లు తన భార్య గురించి దారుణంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాకౌట్ చేయడం, తదనంతరం ప్రెస్ మీట్ లో ఏడవడం ప్రకంపనలు రేపింది. ఈ విషయంపై పలువురు టీడీపీ లీడర్లు.. కుటుంబ సభ్యులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి నేడు తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనం ఒక గౌరవమైన హోదాలో ఉన్నపుడు సభ్య సమాజం తలదించుకునేలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ముఖ్యంగా ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. తప్పిదాలకు పాల్పడి పాపాత్ములు అనిపించుకోవద్దని, ఎల్లవేళలా ఇతరుల పట్ల సానుభూతి, దయతో వ్యవహరించి సాయపడదామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఒమిక్రాన్ కు మందు రెడీ అంటున్న ఆనందయ్య! త్వరలో పంపిణీ!
కాగా, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో స్పందిస్తూ, ఇతరుల వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని భువనేశ్వరి స్పష్టం చేశారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదని.. పనిలేక మాపై విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి పట్టించుకోవడం కూడా మంచిది కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన 48 మందికి సాయం అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు.