ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకొంది. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం.. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా అంటూ శపథం చేయడం. నందమూరి కుటుంబం ప్రెస్ మీట్ పెట్టడం. వంటి అంశాలను గమనిస్తే ఏపీలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలతో సంబంధంలేని చంద్రబాబు భార్యను దూషించారనేది ఆరోపణ. ఆ విషయాన్ని అధికార పార్టీ వారు కొట్టిపారేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ స్పందించాడు. ఈ ఘటన ఎంతో దురదుష్టకరం అంటూ కల్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు.
‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నాను’ అంటూ కల్యాణ్ రామ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. అసెంబ్లీలో అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేశాడు.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 20, 2021