ఏపీలో కొత్తగా ఇటీవల చెత్త పన్ను వసూలును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చెత్తపై పన్నేంటంటూ.. చాలామంది ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గొడవ కూడా చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం చెప్పినట్లు చెత్తపన్ను చెల్లించని వారిని మునిసిపల్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చెత్త పన్ను చెల్లించని వారికి చుక్కలు చూపిస్తున్నారు. బుధవారం చెత్త పన్ను వసూలు కోసం వెళ్లిన కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది.. చెత్త పన్ను ఎందుకు చెల్లించాలన్న దుకాణదారుల వాదనతో విసుగు చెంది.. ఏకంగా నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను ఆయా షాపుల ముందు పారబోశారు. దీంతో దుకాణదారులు షాక్ తిన్నారు.
నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలో శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకు ఉన్న షాపుల వద్ద చెత్త పన్ను వసూలు చేసేందుకు వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి మునిసిపల్ సిబ్బంది వెళ్లారు. ఇప్పటికే తాము ఆస్తి పన్ను, నీటి పన్నుతో పాటు ట్రేడ్ లైసెన్స్లకు కూడా రుసుము చెల్లిస్తున్నాం కదా? ఇక చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని దుకాణదారులు సిబ్బందిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ సిబ్బందితో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకోగా.. సహనం కోల్పోయిన సిబ్బంది నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను అక్కడికి తెప్పించి దుకాణాల ముందు పారబోసి వెళ్లారు. అసలే కరోనా కష్టాలతో షాపులు అంతంత మాత్రం నడుస్తుంటే.. ఈ చెత్త పన్ను వసూళ్లు ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చెత్త పన్ను విషయంలో సీఎం జగన్ ఆలోచించాలని కోరుతున్నారు