ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వదలడం లేదు. ఇటీవలే వచ్చిన తుఫాన్ కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తుఫాన్ దెబ్బకు విలవిల్లాడాయి. తాజాగా మరో తుఫాన్ ముప్పు ఏపీకి పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండా మారింది. దీంతో ఏపీ, తమిళనాడు ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. సోమవారం ఉదయం దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఈ అల్పపీడనం ఏర్పడింది. ఈ వాయుగుండం తుఫానుగా మారి.. తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు ప్రయాణించనుంది. మంగళవారం సాయంత్రానికి ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడనుంది.
ఈ తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఏపీలోని దక్షిణ ప్రాంతం, తమిళనాడు కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుఫాను ఈ నెల 8వ తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని ఐఎండీ తెలిపింది. అయితే ఉత్తర కోస్తాపై ఈ తుఫాన్ ప్రభావం కాస్తా తక్కువగా ఉంటుంది. ఈ తుఫాన్ ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం రాయలసీమ ప్రాంతంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది.
గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ తుఫాను ప్రభావంతో కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అలానే 7 నుంచి10వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విశాఖ పట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. మరోవైపు తీర ప్రాంతాల్లోని రెవెన్యూ యంత్రాంగాన్ని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అప్రమత్తం చేసింది బంగాళ ఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ కు మాండోస్ గా యుఏఈ నామకరణం చేసింది.