ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన సినిమా టికెట్ల వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిత్రం దీనిపై చర్చించడానికి చిరంజీవితో పాటు పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ని కలిశారు. “మా” అధ్యక్షుడిగా టాలీవుడ్ సమస్యలపై తన అభిప్రాయం చెప్పడానికి మంచు విష్ణుకి సీఎం జగన్ సమయం ఇచ్చారని భావిస్తున్నారు. అయితే సినీ ప్రముఖులు వచ్చినప్పుడు వారితో వ్యవహరించిన విధానం.. ఇప్పుడు మంచు విష్ణుకు లభించిన గౌరవం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్లు వచ్చినప్పటికీ వారి వాహనాలను ఇంటి గేటు బయట నిలిపివేసి సెక్యూరిటీ చెకింగ్ గెట్ వే ద్వారా అందర్నీ లోపలికి పంపారు. అయితే మంచు విష్ణుకు మాత్రం నేరుగా లోపలికి అనుమతించారు. ఆయన కారులో నేరుగా సీఎం జగన్ ఇంటి వరకూ వెళ్లిపోయారు. ఈ రెండు దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు సీఎం జగన్ కు బంధువని .. కుటుంబసభ్యులకు జగన్ ఇంటి వరకూ పర్మిషన్ ఉంటుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి : జగన్-చిరు టీం భేటీపై మంచు ఫ్యామిలీ కామెంట్..! ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
టాలీవుడ్ సమస్యలపై ఇటీవల చిరంజీవి నేతృత్వంలోని బృందం జగన్ నివాసానికి వచ్చి చర్చలు జరిపింది. ఆ భేటీకి మోహన్ బాబుకు ఆహ్వానం అందలేదు . అలాగే “మా” అధ్యక్షుడైన మంచు విష్ణుకు కూడా ఆహ్వానం అందలేదు. సీఎం జగన్-చిరంజీవి బృందం భేటీ తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత రోజు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని హైదరాబాద్లోని మోహన్ బాబు ఇంట్లో సమావేశం కావడం, ఆ తర్వాత మంచు విష్ణు చేసిన ట్వీట్ లు వివాదాస్పదం కావడం.. దీనిపై మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వివాదం ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే విష్ణు ఈ సారి నేరుగా సీఎం జగన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.