నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసింది. ఈ ఘటనతో రాష్ట్రమంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రధాని మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన మరవకముందే చంద్రబాబు సభలో మరో విషాదం చోటు చేసుకుంది. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ వారు నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా అందరు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో పలువురు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. నీకు సిగ్గులేదా?.. ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటావు” అంటూ కేఏ పాల్ నిప్పులు చెరిగారు.
ఆయన మాట్లాడుతూ..” చంద్రబాబు నాయుడు గారు శవ రాజకీయాలు చేస్తున్నారు. బాబు మాకు ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రాణం విలువకు లక్షలు ఇస్తే సరిపోతుందా?. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై ఇదేం ఖర్మ అంటూ మీరు తిరుగుతున్నారు. అంతకంటే వంద రేట్లు మీరు చేసే అవినీతి ఊహకే అందటంలేదు. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే నీకు నేను వార్నింగ్ ఇచ్చాను. అయినా నువ్వు మారలేదు. అసలు నీకు చిత్త శుద్ది ఉందా?. నువ్వు మారాలని 22 సార్లు ఆశీర్వదించాను. నువ్వు ఒక శాతమైన మారావా? నీకు సిగ్గులేదా?. ఇంకెంత మందిని బలి తీసుకుంటావు. ఈ చంద్రబాబు గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారు. అలానే కందుకూరు ఘటనలో 8 మందిని బలిచేశారు.
రాష్ట్రం కోసం తన జీవితం అంటూ 40 ఏళ్లుగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడి ప్రాణం తీసిన మనిషి.. వంగవీటి రంగాను పొట్టన బెట్టుకున్న వ్యక్తి.. ఈ చంద్రబాబు. కొన్ని మీడియాలకు చిత్త శుద్ధిలేదు. అందుకే వాస్తవాలను చూపించడంలేదు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా నీలో మార్పు రాదా? . నీకు సిగ్గులేదా చంద్రబాబు. అంతేకాక వరుస ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. త్వరలో చంద్రబాబు సభలో జరిగిన ఘటనలపై నేనే స్వయం గా హైకోర్టులో పిటిషన్ వేస్తాను” అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు పట్టణంలోని వికాస్నగర్లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టారు. సుమారు 30 వేల మందికి.. కానుకలు ఇవ్వాలని నిర్వాహకులు భావించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత కానుకల పంపిణీ మొదలుపెట్టారు. ఈ క్రమంలో జనాలు చంద్రన్న కానుకల కోసం తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురి కాగా.. వారిని గుంటూరు జీజీహెచ్, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరి.. చంద్రబాబు నాయుడిపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.