మరో నటుడికి జగన్ ప్రభుత్వం కీలక పదవికి అప్పగించింది. జోగి బ్రదర్స్ తో మనల్ని అలరిస్తున్న వారిలో ఒకరైన జోగి నాయుడికి కీలక పదవికి నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
సినీ పరిశ్రమకు చెందిన మరో నటుడికి జగన్ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. సినీ నటుడు, కమెడియన్, టీవి యాంకర్ జోగినాయుడు (ఝాన్సీ మాజీ భర్త)కు ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ పదవిలో జోగినాయుడు ఎంత కాలం కొనసాగుతారు, ప్రభుత్వం ఎంత వేతనం చెల్లించనుందన్న అంశాలను ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఏపీ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ సీఈవో నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు జోగి నాయుడును క్రియేటివ్ హెడ్గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జోగినాయుడుకు పి కేటగిరిలో వేతనం, ఇతర అలవెన్సులు వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు.
విశాఖ పట్నంలో జన్మించిన జోగి నాయుడు ..1998లో జెమిని టీవీలో ప్రసారమైన ‘జోగి బ్రదర్స్’ అనే కార్యక్రమంతో పేరు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మరో వ్యాఖ్యాత కృష్ణంరాజుతో కలిసి సినిమాల గురించి ఉత్తరాంధ్ర యాసతో సమీక్షించేవారు. దీంతో వీరికి జోగి బ్రదర్స్ గా ముద్ర పడింది. సినీ దర్శకుడిగా కావాలన్న ఉద్దేశంతో హైదరాబాద్కు వచ్చిన జోగి నాయుడు టీవీ రంగంలో ప్రవేశించారు. స్రిప్టుపై మంచి అనువభవం ఉండటంతో కొద్ది రోజుల పాటు ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, కృష్ణవంశీతో కలిసి పని చేశారు. 2001లో ఇవివి సినిమా మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. అమ్మ నాన్న తమిళమ్మాయి, సుబ్బు, ఠాగూర్, స్వామి రారా, కార్తికేయలో మంచి పాత్రల్లో నటించారు. ఇటీవల వచ్చిన అనుకోని ప్రయాణంలో జోగి బ్రదర్స్ నటించారు.
2001లో ప్రముఖ స్టార్ యాంకర్ ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ధన్య అనే కుమార్తె ఉంది. కొన్ని విభేదాల కారణంగా 2014లో విడాకులు తీసుకున్నారు. 2018లో సౌజన్య అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు. కాగా, 2019 ఎన్నికలకు ముందు జోగినాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టారు. కాగా, గతేడాది నవంబర్లో నటుడు పోసాని కృష్ణమురళికి జగన్ సర్కారు కీలక పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించింది. తాజాగా, జోగినాయుడుకు కీలక పదవి కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.