ఏపీలోని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను.. అర్హులైన లబ్దిదారులను గుర్తించి, వారికి చేరువ చేయడమే గ్రామ, వార్డు వాలంటీర్ల విధి. గ్రామ, వార్డు వాలంటీర్లదీ సేవాలాంటింది. ఇప్పుడు వీరి సేవలను గుర్తించిన జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సరికొత్తగా ఏర్పడ్డ వ్యవస్థ గ్రామ,వార్డు వాలంటీర్. జగన్ అధికారంలోకి వచ్చాక ఏర్పడింది ఈ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను.. అర్హులైన లబ్దిదారులను గుర్తించి, వారికి చేరువయ్యేలా చేయడమే గ్రామ, వార్డు వాలంటీర్ల విధి. ఇది ఓ స్వచ్ఛంద సేవాలాంటింది. తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా వీరు పనిచేయాలి. ఇప్పటికే అనేక మంది గ్రామ వాలంటీర్లు ఇంటి వద్దకే ప్రయోజనాలను అందిస్తున్నారు. ఫించను, రేషన్తో పాటు పలు సంక్షేమాలు, పథకాలతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా మంది ప్రయోజనం పొందుతూ ఉన్నారు. ఈ ప్రయోజనాలను లబ్దిదారులకు అందేలా విశేషంగా కృషి చేస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు.
ఇప్పుడు గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వీరి సేవలను గుర్తించి గత రెండేళ్లుగా సత్కరిస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా వారిని సత్కరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ వాలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఏపీలో మొత్తం 2లక్షల 33వేల 719 మంది వాలంటీర్లను ఈ ఏడాది సత్కరించనున్నారు. నెల పాటూ సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గత రెండేళ్ల కాలంలో ఏప్రిల్ నెలలో లేదా ఉగాది సమయంలో ఈ సత్కార కార్యక్రమాన్నినిర్వహించారు. గౌరవ వేతనంతో వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఏటా ఉగాది సందర్భంగా ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ఈ ఏడాది ఉగాది సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ నెల 14 నుంచి వాలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కనీసం ఏడాది పాటు వాలంటీర్గా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులకు తావులేని వారిని సత్కరిస్తారు. ఏపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మూడు కేటగిరీల్లో అవార్డులు అందజేస్తారు.ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లను ‘సేవా వజ్ర’ పురస్కారం అందజేస్తారు. వారికి రూ.30 వేల నగదు, బ్యాడ్జి, మెడల్, శాలువా, సర్టిఫికెట్తో సత్కరిస్తారు.
అలాగే ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4,220 మందికి ‘సేవారత్న’ అవార్డు అందజేస్తారు. ఈ కేటగిరీ కింద రూ. 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ అందజేస్తారు. ‘సేవావిుత్ర’ పురస్కారం కింద 2,28,624 మందికి రూ.10 వేల నగదు అందజేస్తారు. వాలంటీర్ల పనితీరుతో పాటూ ఆ ప్రాంత కుటుంబాలు సంతృప్తి.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ల హాజరు.. ప్రతి నెలా మొదటి రోజునే వంద శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీతో పాటూ మిగిలిన అంశాల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు.