గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇపుడు మరో ప్రమాదం పొంచి ఉంది వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వరుణుడి ఉగ్రరూపానికి తిరుమల సైతం భీతిల్లింది.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజలు వింత శబ్దాలతో హడలిపోయారు. ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ శబ్దాలు భూమిలోంచి వస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా రామకుప్పం మండలంలోని పలు గ్రామాల ప్రజలు వింత శబ్దాలతో ఉలిక్కిపడ్డారు. ఒకదశలో భూకంపం వస్తుందని భయంతో గజ గజ వణికిపోయారు. భారీ శబ్దాలు వస్తూనే ఉండడంతో ప్రజలు మళ్లీ ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడ్డారు. వారికి రామకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు. మరోవైపు కర్ణాటక రాజధాని బెంగళూరులో మళ్లీ వింత శబ్దాలు భయపెడుతున్నాయి.
గతేడాది ఇలాంటి శబ్దాలు రాగా, ఇవి యుద్ధ విమానం పరీక్షిస్తున్నప్పుడు వచ్చిన శబ్దాలు అని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) వెల్లడించింది. నిన్న మధ్యాహ్నం ఈ భారీ శబ్దాలు రావడంతో నగరంలోని రాజరాజేశ్వరి నగర్ లో కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఇది భూకంపం కాదని కర్ణాటక స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ వెల్లడిచింది. తాజాగా మరోసారి అదే రీతిలో భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు లోనయ్యారు.