Agnipath: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆందోళనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలు మోహరించాయి. అంతే కాదు! గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లను హైదరాబాద్ శివారు ప్రాంతాల వరకే నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో విశాఖ నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. బస్సులు, బైకులు, ఆటోలు, కార్లు ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని యువత కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని అధికారులు సూచించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీం దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు ఈ అగ్నిపథ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర భారతంలో మొదలైన ఈ నిరసనలు, దక్షిణ భారతానికి పాకాయి. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ముట్టడించారు. రైళ్లు, స్టాళ్లను తగలబెట్టి నానా భీభత్సం చేశారు. అయితే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై దాడి ప్రీ ప్లాన్గా జరిగినట్లుగా తెలుస్తోంది. ఆర్మీ ఉద్యోగ ఆశావాహుల వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో సికింద్రాబాద్లో నిరసనపై సమాచారం షేర్ చేసుకున్నట్లు సమాచారం. పక్కా ప్లాన్తో సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : సికింద్రాబాద్ అల్లర్ల లో చనిపోయిన యువకుడి కుటుంబానికి రూ.25 లక్షల