ప్రభుత్వ వ్యవస్థలోని ప్రతి శాఖ ప్రజలకు సేవ చేయాల్సిందే. అది వారి బాధ్యత. కానీ చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు తాము మిగతా ప్రజలకన్నా అతీతులమని భావిస్తుంటారు. జనాలను చిన్న చూపు చూసే ప్రభుత్వ ఉద్యోగులు కోకొల్లలు. పోలీసు వ్యవస్థలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. బాధితుల గోడు పట్టించుకోకుండా.. వారికి న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో చూశాం గతంలో. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరేవరకు అధికారుల్లో చలనం ఉండదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు గాను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ‘డయల్ యువర్ ఎస్పీ ప్రజా దర్బార్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ లో నిర్లక్ష్యానికి గురైన వారు, న్యాయం దక్కని వారు ఎస్పీకి నేరుగా కాల్ చేసి తమ సమస్యను చెప్పుకుంటున్నారు. ఎస్పీ బాధితులను ఓదార్చి.. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడమే కాక నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బాధితురాలు తెనాలి రూరల్ ప్రాంతం కొలకలూరుకు చెందిన మహిళ. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధిత మహిళకు.. వేరే కులం వ్యక్తితో వివాహం అయ్యింది. కొన్ని రోజుల వరకు బాగానే సాగింది. ఇక బాధితురాలు గర్భవతిగా ఉన్న సమయం నుంచి అత్తింటి వేధింపులు ప్రారంభం అయ్యాయి. కడుపుతో ఉందనే జాలి, దయ లేకుండా బాధితురాలి అత్త, ఆడపడుచు ఆమెను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఇదేంటని ప్రశ్నించడానికి బాధితురాలికి తల్లిదండ్రులు కూడా లేరు. తోడుగా ఉండాల్సిన భర్త.. డెలివరీ అయిన మూడు రోజులకే ఆమెను వదిలేసి వెళ్లాడు.
అత్తింటి వేధింపులు భరించలేక.. విసిగి వేసారిపోయిన బాధితురాలు తెనాలి ఎస్సైకి ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ సదరు ఎస్సై మహిళ ఫిర్యాదును తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీని గురించి బాధితురాలు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో కాల్ చేసి.. తన బాధను ఎస్పీకి వివరించింది. ఆమె ఫిర్యాదు విన్న విశాల్.. సదరు ఎస్సైకి కాల్ చేసి.. ఫోన్ లోనే చివాట్లు పెట్టారు. తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కింద వీడియోని క్లిక్ చేయండి. ఎస్పీ విశాల్ గున్ని తీసుకున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.