టాలీవుడ్ గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెంది రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఏళ్ల పాటు.. తన గానామృతంతో అశేష ప్రేక్షకులను అలరించారు బాలు. ఆయన మృతి తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది. బాలు స్థానాన్ని భర్తీ చేసే గాయకులేవరు తెలుగు ఇండస్ట్రీలో లేరంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో అంతటి ఖ్యాతి గడించిన గానగంధర్వుడికి తీరని అవమానం జరిగింది. అభిమానులు ఎంతో ప్రేమతో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుంటే.. కనీసం 24 గంటలు కూడా గడవకముందే.. దాన్ని తొలగించారు అధికారులు. ఈ క్రమంలో బాలు అభిమానులు.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విరాలు..
గుంటూరులోని మదర్ థెరిస్సా జంక్షన్ వద్ద కళాదర్భార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బాలు విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. విగ్రహం ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్న కారణంతో నగరపాలక సంస్థ అధికారులు సోమవారం నాడు ఆ విగ్రహాన్ని తొలగించారు. అంతేకాక విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మెను కూల్చివేసి.. ఎస్పీ బాలు విగ్రహాన్ని అక్కడినుంచి తరలించారు అధికారు. ప్రముఖ గాయకుడి విగ్రహాన్ని ఇలా తొలగించడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పు పడుతున్నారు.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ప్రశ్నించారు. గుంటూరులో ఆదివారం రాత్రి సింగర్ ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేస్తే.. కనీసం 24 గంటలు కూడా గడవకముందే.. మరుసటి రోజే మునిసిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించడం సరికాదన్నారు. పైగా ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసిన తొలి ఎస్పీ బాలు విగ్రహం ఇదేనన్నారు. తొలిసారి విగ్రహం ఏర్పాటు చేస్తే, గుంటూరు అధికారులు ఇలా చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.