దేశంలోని ప్రముఖ అమ్మవారి పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. కృష్ణా నది ఒడ్డున వెలసిన అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక దసరా పండగ సందర్భంగా అమ్మవారికి నవరాత్రుల పూజలు మొదలయ్యాయి. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. నేడు ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కొంతమంది వికలాంగులు, వృద్ధులను ఇబ్బందులు పడ్డారు. ఆ విషయం మంత్రి దృష్టికి వెళ్లింది. దీంతో అలాంటి వారికి అమ్మవారి ఆలయ అధికారులు శుభవార్త తెలిపారు. నేటి నుంచి వీరికి ప్రత్యేక సమయం,వాహనాలను కేటాయించారు.
వ్యవస్థలో ఏదైనా తప్పులు జరగడం సహజం.. అయితే వాటిని సరిచేసుకుంటూ మరోసారి జరగకుండా చూసుకుంటే అందరూ హర్షిస్తారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మ వారికి దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా జరపాలని దేవాదాయశాఖ భావించింది. అందుకు అనుగుణంగా భక్తుల ఇబ్బందులు పడకుండా అనేక చర్యలు తీసుకుంటోంది. శరన్నవరాత్రి వేడుకల్లో ఎదురవుతున్న సమస్యలను, లోపాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది. ఈక్రమంలో శరన్నవరాత్రి రోజుల్లో దుర్గమ్మను దర్శించుకునే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సమయం కేటాయించారు. బుధవారం నుండి మూలా నక్షత్రం రోజు మినహా మిగిలిన అన్ని రోజుల్లో రెండు స్లాట్స్ లో అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు.
మొదటి స్లాట్ ఉదయం 10-12 గంటలు, రెండోది సాయంత్రం 4-6 గంటల వరకు ఉంటుంది. ఈ రెండు టైమ్ స్టాట్స్ లో వికలాంగులు, వృద్ధులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. అంతే కాకుండా వారికోసం దేవస్థానం సమీపంలోని మోడల్ గెస్ట్ హౌస్ నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులకు ఈ ప్రత్యేక దర్శనం కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దర్శన అనంతరం భక్తులను తిరిగి అదే వారు ఎక్కిన ప్రాంతం వద్ద వదిలిపెట్టే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కనకదుర్గ ఆలయ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.