గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పొబ్రేషన్ ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తించనున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప్రొబేషన్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 నోటిఫికేషన్లో ఎంపికైన సిబ్బందికి పొబ్రేషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఏప్రిల్ 17న అనగా సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రొబేషన్ నిర్ణయం ద్వారా సచివాలయ ఉద్యోగాలకు భద్రత ఏర్పడినట్లయ్యింది.
శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ ప్రొబేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరు డీఏ, హెచ్ఆర్ఏతో కలుపుకొని రూ.29,598 వేతనంగా అందుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. వీరు డీఏ, హెచ్ఆర్ఏతో కలుపుకొని రూ.28,753 వేతనంగా అందుకోనున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని డిపారెంట్ టెస్టులో ఉత్తీర్ణులై, ఎటువంటి నేర చరిత్ర లేదన్న పోలీసు రిపోర్టులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్కు అర్హులైన ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి కేటగిరీ వారిగా అర్హుల పేర్లతో కూడిన జాబితాలతో వేరువేరుగా ప్రోసీడింగ్స్ జారీ చేశారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల్లోనే సచివాలయ సిబ్బంది నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించే ప్రొబేషన్ డిక్లరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🟥1 May 2023 నుండి రాష్ట్రంలో సచివాలయ సిబ్బందికి కొత్త pay scale అమలు
🟥ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం pic.twitter.com/6Ebl7DSpnU
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 17, 2023