డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియని పండ్ల ప్రియులు ఉండరు. ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగా ఉపయోగ పడుతుందో తెలిసిందే. అయితే ఆరోగ్యాదాయిని గా పేరుగాంచిన ఈ డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కూడా కాసుల పంట పండిస్తోంది. ఉద్యాన పంటలకు పెట్టింది పేరైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ డ్రాగ్ ఫ్రూట్ ను పండిస్తున్నారు. ఈ జిల్లా రైతులకు లాభదాయకంగా సాగు చేస్తున్న పండ్ల రకాల్లో తాజాగా డ్రాగన్ ఫ్రూట్ కూడా చేరింది. సేంద్రియ పద్ధతుల్లో వీటిని సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ.. మంచి లాభాలను కళ్ల జూస్తున్నారు ఇక్కడి రైతులు. మరి.. ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డ్రాగన్ పండ్లను పండిస్తూ మంచి ఆదాయాన్ని అర్జిస్తున్న రైతుల్లో కేవీ రమణారెడ్డి ఒకరు. అనంతపురం శివార ప్రాంతమైన సిండికెట్ నగర్ కు చెందిన రమణ రెడ్డి.. గార్లదిన్నె మండలం మర్తాడులో మూడు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తున్నారు. దీనితో పాటు మరో 6 ఎకరాల్లో ఖర్జూరం కూడా సాగు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈ డ్రాగన్ పంటకు శ్రీకారం చుట్టి, రెండో ఏడాదే మంచి దిగుబడులు సాధించారు. రెండేళ్ల క్రితం రెడ్ రకం కి చెందిన 6 వేల డ్రాగన్ మొక్కలను తెప్పించిన రమణారెడ్డి.. మూడు ఎకరాల్లో నాటారు. మొక్కల మధ్య 8 అడుగులు, సాళ్ల మధ్య 10 అడుగులు దూరంలో సిమెంటు స్తంభాలు వేయించారు. ప్రతి స్తంభం చుట్టూ 4 డ్రాగన్ మొక్కలు నాటారు. అంతకంటే ముందు గుంతల్లో వేపపిండి, వర్మీకం పోస్టు, పశువుల ఎరువు వేసి..మొక్కలు నాటారు.
అలా ఎకరాకు 500 సిమెంట్ స్తంభాలు నాటారు. పై భాగంలో మొక్కలకు కోసం పాత టైర్లను అమర్చారు. అయితే ఈ మొత్తం విధానానికి తొలి ఏడాది ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఆ తర్వాత నుంచి ఏటా రూ.50 వేలు ఖర్చు వస్తుంది. ఈ పంటకు నీళ్లు పెద్దగా అవసరం లేదు. డ్రిప్ సిస్టమ్ ద్వారా 15 రోజులకో తడి ఇస్తున్నారు. వర్షకాలంలో ఈ తడి కూడా అవసరం లేదని రమణారెడ్డి తెలిపారు. ఇంకా రమణారెడ్డి మాట్లాడుతూ… “ఎకరాకు 10 నుంచి 12 టన్నుల వరకు డ్రాగన్ పండ్ల దిగుబడి వస్తుంది. కోతకు కూలీలు కూడా ఎక్కువ మంది అవసరం లేదు. ఇదే సమయంలో అంట్లు కట్టి, మొక్కల అమ్మకం కూడా చేస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రాగన్ పంటను మించిన ఆదాయానిచ్చే మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి నాటుకుంటే గరిష్టంగా 25-30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. మొక్కల ఎంపికలో కొంత జాగ్రత్త తీసుకుంటే చాలు”అని తెలిపారు.
ఇంకా ఆయన పంట గురించి వివరిస్తూ..”డ్రాగన్ ఫ్రూట్ పంట ద్వారా రెండో ఏడాది ఉహించిన దానికన్న అధిక దిగుబడి వచ్చింది. మూడు ఎకరాల్లో కలిపి ఇప్పటికే 18 టన్నుల పండ్లు అమ్మాను. పండు సైజును బట్టి టన్ను వచ్చేసి.. రూ.1.35 లక్షల నుంచి రూ.1.65లక్షల వరకు పలికింది. ఇలా అన్ని లెక్కలు వేసుకుంటే రూ.50 లక్షలు పై వస్తాయి” అని రమణా రెడ్డి తెలిపారు. మరి.. ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుపై మీ అభిప్రాయాలను కామంట్స్ రూపంలో తెలియజేయండి.