ఇటీవల వరుసగా రాజకీయ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. గుమ్మడి కుతుహలమ్మ, బీఆర్ఎస్ నేత సాయన్న, మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఈ మూడు నెలల కాలంలోనే తుది శ్వాస విడిచారు. తాజాగా మరో నేత మరణించారు.
ఇటీవల వరుసగా రాజకీయ ఉద్ధండులు, మేథావులు కన్నుమూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ ఫిబ్రవరిలో మృతి చెందిన సంగతి విదితమే. ఆమె మరణం తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సాయన్న తుది శ్వాస విడిచారు. అలాగే రాజకీయాల్లో నిరూపించుకునేందుకు సిద్ధమైన టాలీవుడ్ నటుడు తారకతర్న ఓ పార్టీ ప్రచార కార్యక్రమంలో కుప్పకూలి.. మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయారు. తాజాగా మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కూడా అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. ఇప్పుడు మరో నేత తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
మాజీ ఎంపీ, ఉత్తరాంధ్ర సీనియర్ నేత , బీజెపీ నేత డాక్టర్ కణితి విశ్వనాధం (90) శనివారం మధ్యాహ్నం మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశ్వనాథం 1932 జూలై 1న శ్రీకాకుళం జిల్లాలోని హరిదాసుపురంలో జన్మించారు. గతంలోనే ఆయన భార్య లలితా కన్నుమూశారు. విశ్వనాథం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ చదివాడు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి 1989, 1991 లలో రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.
1989లో కౌన్సిల్ కమిటీ సభ్యుడు, ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వశాఖలో పనిచేశారు. 2014 నవంబరు 7న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి సమక్షంలో బిజెపిలో చేరారు. కాశీబుగ్గలో జరిగిన కార్యక్రమంలో అతని తనయుడు రాజేంద్ర, అతని అనుచరులు అధిక సంఖ్యలో బీజేపీలో చేరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యునిగా 34 సంవత్సరాలు వ్యవహరించారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.