ప్రస్తుతం ఉన్నవి చదువుకొనే రోజులు. విద్య పేరు మీద వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అన్ని డబ్బులు పెట్టినా.. నాణ్యమైన విద్య దొరుకుతుందా అంటే డౌటే. కానీ ఓ స్కూల్ మాత్రం 1-12 వ తరగతి వరకు, సీబీఎస్ఈ సిలబస్లో, ఇంగ్లీష్ మీడియంలో.. అది కూడా ఉచితంగా వసతి, భోజనం కల్పిస్తూ.. చదువు చెబుతోంది. మరి ఆ స్కూల్ ఎక్కడుంది.. ఎవరు అర్హులు వంటి వివరాలు..
ఈ సృష్టిలో అన్నింటికన్నా భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే.. తల్లిదండ్రులు లేకుండా.. అనాథలుగా బతకాల్సి రావడం. కన్నవాళ్ల ఆచూకీ తెలియక.. నా అనే వాళ్లు ఎవరు లేక.. ఆదరించే దిక్కు లేక.. వారు అనుభవించే వ్యధ.. వర్ణనాతీతం. అనాథలు పడే బాధలు చూస్తే.. పగవాడికి కూడా ఇలాంటి కష్టం వద్దు అనిపిస్తుంది. వారికి మూడు పూటలా కడుపు నిండా తిండి, ఒంటిని దాచుకునేందుకు సరిపడా బట్టలు, తలదాచుకునేందుకు ఇంత నీడ దొరకడమే చాలా కష్టం. అలాంటిది వారు చదువుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. అది కూడా కార్పొరేట్ స్కూల్లో అంటే.. ఇక అత్యాకు మించిన పదాన్ని వాడాలి. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే పాఠశాల అనాథల పాలిట కల్పతరువు. నా అన్నవాళ్లు లేక.. ఎవరి ప్రేమకు నోచుకోక.. నిరాశలో బతికే అనాథలను చేరదీసి.. వారికి ఉచితంగా వసతి, భోజనం కల్పించి.. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా చదువును అందిస్తోంది ఓ పాఠశాల. మరి ఆ విద్యానిలయం ఎక్కడుంది.. అర్హులు ఎవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి వివరాలు..
అనాథల పాలిట వరంగా నిలిచిన ఈ పాఠశాల పేరు హీల్ ప్యారడైజ్. ఇది ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపల్లి గ్రామంలో ఉంది. 30 ఏకరాల విస్తీర్ణంలో.. ఆహ్లాదకరమైన వాతావరణంలో.. సువిశాల ప్రాంగణంలో ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. దీనిలో పేద, అనాథ చిన్నారులకు ఉచిత విద్యతో పాటు, ఫ్రీగా వసతి, భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక ఈ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా.. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అది కూడా సీబీఎస్ఈ సిలబస్తో.. ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని.. వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పి.. ఉన్నత స్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో.. హీల్ ప్యారడైజ్ పాఠశాల ప్రారంభం అయ్యింది. గుంటూరుకు చెందిన డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్ అనే వ్యక్తి.. ఈ విద్యాసంస్థను 1993లో ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఇక్కడ 750 మంది అనాథ బాలబాలికలు చదువుతున్నారు.
ఈ పాఠశాలలో ఉన్న వసతులు చూస్తే.. కార్పొరేటు సంస్థలు కూడా దీని ముందు దిగదుడుపే అనిపించకమానదు. ఇక ఈ స్కూల్లో బాలబాలికలకు వేర్వేరుగా అధునాతన వసుతులు కలిగిన హాస్టల్స్ ఉన్నాయి. ఇక విద్యార్థులకు అందించే భోజనం విషయంలోనూ.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలను ఆహారంలో వినియోగిస్తారు. విద్యార్థులు తాగేందుకు ఆర్ఓ ప్యూరిఫైడ్ నీటిని అందిస్తారు. ఇక పాఠశాలలో 15 వేల పుస్తకాలతో అతి పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేశారు. కేవలం చదువు మాత్రమే కాకుండా.. త్రీడీ పెయింటింగ్, కళలు, సంగీతం, డ్యాన్స్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. క్రీడలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన 400 మీటర్ల ట్రాక్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, హ్యాండ్బాల్ కోర్టులున్నాయి. విద్యార్థుల ఆసక్తి మేరకు వారికి ఆయా అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఇక్కడ ఇంటర్ వరకే అవకాశం ఉన్నప్పటికి.. ఆ తర్వాత కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని భావించే విద్యార్థులకు సహకారం అందిస్తున్నారు హీల్ స్కూల్ యాజమాన్యం. వారు డిగ్రీ, పీజీ పూర్తి చేసేందుకు కావాల్సిన సాయం చేస్తారు. ఇక విద్యార్థుల కోసం స్కూల్ ప్రాంగణంలోనే ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఇక దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన అనాథ చిన్నారులైనా ఇక్కడ చేరవచ్చు. ఇక 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 1-5వ తరగతి వరకు ప్రవేశాలను కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూముల్లో తరగతులు నిర్వహిస్తారు.