దేశంలో ఎన్నికలు అంటే ప్రతి ఐదేళ్ళకు ఒక్కసారి వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ గెలిచిన అభ్యర్థి మరణించినా.. రాజీనామా చేసినా అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. ఇలా దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికల తంతు జరుగుతూనే ఉంది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి పంచాయతీ ఎన్నికలు 60 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగాయి.
కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలిచారు. లక్కసాగరం పంచాయతీ ఆవిర్భావం నుంచి ఎన్నికలు జరగలేదు. ఈ పంచాయతీ ఎవరికి రిజర్వు అయినా ఇప్పటి వరకు గ్రామస్థులందరూ కలిసి ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. గ్రామంలో 2,375 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని కృష్ణగిరి మండలం లక్కసాగరం పంచాయతీకి తొలిసారి రెండు వర్గాలు పోటీ పడ్డాయి.
గత ఫిబ్రవరి నెలలో లక్ష్మీదేవి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆమె మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి అక్కడ గ్రామస్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సి ఉన్నా పోటీ అనివార్యం అయ్యింది. తొలిసారి రెండు వర్గాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమయ్యారు. ఇక ఆదివారం జరిగిన ఎన్నికలో ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సర్పంచ్గా ఎన్నికయ్యారు.