దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటనలో ఎంసీఏ విద్యార్థిని శశికళ మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. దాదాపు 30 గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆమె ఓడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. శశికళ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శశికళ తల్లిదండ్రుల ఆవేదనకు అడ్డులేకుండా పోయింది. ఎన్నో నోముల ఫలంగా పుట్టిన బిడ్డ ఇలా అర్థాంతరంగా తమను వదిలి వెళ్లిపోవటంతో ఆ తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. వారి బాధ ఎవరూ తగ్గించలేనిది. శశికళ వారి జీవితంలోని లోటు ఎవరూ పూడ్చలేనిది.
పెళ్లయిన ఆరేళ్లకు పుట్టిన బిడ్డ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన బాబూరావు, వెంకట లక్ష్మిల కూతురు శశికళ. ఈమె వారికి ఒక్కగానొక్క కూతురు. పెళ్లయిన ఆరేళ్లకు పుట్టిన బిడ్డ. ఎంతో అపురూపంగా చూసుకుంటూ వస్తున్నారు. అడిగింది లేదనకుండా.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శశికళ ఉన్నత చదువులు చదివి ఓ గొప్ప స్థానానికి ఎదిగితే చూసి మురిసి పోవాలనుకున్నారు. కూతురి మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. శశికళ కూడా తల్లిదండ్రుల ప్రేమను, ఆప్యాయతను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఇచ్చేది.
ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనుకునేది. ఆ కలతోనే దువ్వాడలోని ఓ కాలేజ్లో ఎంసీఏలో చేరింది. కాలేజ్కు ఇంటికి బాగా దూరం ఉండటంతో రైలులో జర్నీ చేసేది. నవంబర్ 20వ తేదీ నాటినుండి0 అన్నవరం నుంచి దువ్వాడ స్టేషన్ వరకు వచ్చేది. అక్కడినుంచి వేరే వాహనంలో కాలేజీకి వెళ్లేది. అయితే, రోజూ ఇలా అప్ అండ్ డౌన్ చేయటం ఇబ్బందిగా మారటంలో దువ్వాడలో హాస్టల్లో ఉండటానికి నిశ్చయించుకుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మరికొన్ని రోజుల్లో హాస్టల్కు వెళ్లిపోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రమాదవాశాత్తు ప్లాట్ ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయింది.
30 గంటల పోరాటం.. ఆపస్మారక స్థితిలోనే మరణం..
బుధవారం ఉదయం సమయంలో శశికళ గుంటూరు- రాయగడ ఎక్స్ప్రెస్లో దువ్వాడ స్టేషన్కు వచ్చింది. అక్కడ రైలు ఆగే క్రమంలో ప్రమాదవశాత్తు ప్లాట్ ఫాం-రైలు మధ్యలో పడిపోయింది. రైలు ఆమెను నలుపుకుంటూ ముందుకు వెళ్లి ఆగింది. అప్పటికే ఆమె రొమ్ము భాగంలోని బర్రె ఎముకలు విరిగి ఊపిరితిత్తులలోకి పొడుచుకుపోయాయి. ప్రాణాలు పోతున్న నొప్పి. బయటకు రాలేక నరకం అనుభవించింది.
తోటి ప్రయాణికులు ఆమెను పక్కకులాగటానికి ప్రయత్నించారు. అయినా వారి వల్ల కాలేదు. కొన్ని గంటల తర్వాత రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటలకుపైగా కష్టపడి ఆమెను బయటకు తీశారు. అయితే, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. పక్కటెముకలు ఊపిరితిత్తులను పాడు చేయటంతో అధికంగా ఇన్నర్ బ్లీడింగ్ జరిగింది. ఆమెను హుటాహుటిన షీలానగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.