వెలాడుతున్న తోరణాలన్నీ కరెన్సీ నోట్లతో కట్టినవే.. అమ్మవారికి వేసిన దండలన్నీ డబ్బుతో అల్లినవే.. కిలోల కొద్దీ బంగారం, వెండి బిస్కెట్లతో అమ్మవారిని అలంకరించి, భక్తులకు కనుల విందును అందించారు. సింహపురి సీమలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారే ఈ కరెన్సీ మధ్యలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదోరోజు సోమవారం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారిని, ఆలయాన్ని రూ.ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ.3.5కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు బిస్కెట్లు, రూ.3.5 కోట్ల విలువైన 60 కిలోల వెండిబిస్కెట్లు, ఆభరణాలతో అలంకరించారు.
ఇందుకోసం మహబూబునగర్ జిల్లా బందరుకు చెందిన వేమూరిచంద్రశేఖర్ నేతృత్వంలో 120 మంది నిపుణులు పనిచేసి అమ్మణ్ణి ఆలయానికి మరింత శోభను సంతరింపజేశారని ముక్కాల ద్వారకానాథ్ వివరించారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులుతీరారు.