రాయలసీమ జిల్లాలు జలప్రళయంతో అతలాకుతలమయ్యాయి. ఊహించిన ముప్పుతో ఈ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాత్రికి రాత్రే ప్రాజెక్ట్ లు, చెరువులు నిండు కుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవడంతో ప్రాణ నష్టం చోటుచేసుకుంది. అయితే తాాజగా ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను జగన్ పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన తిరుగు వెళ్లారు.
జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిన్న అర్ధరాత్రి సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంత్రి దగ్గరుండి మరీ బాధితులను బస్సు ఎక్కించి పంపించారు. అర్ధరాత్రి నెల్లూరు నగర కమిషనర తో కలిసి డీకేడబ్ల్యూ కళాశాలలో ఉన్న పునరావాస కేంద్రాన్ని పరిశీలించి.. భోజన సౌకర్యాలు మంచినీళ్లు సౌకర్యాలపై ఆరా తీశారు.
ముంపు ప్రాంతాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పరిశీలించి..సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటించారు. నెల్లూరు రూరల్ ముంపు ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కొవ్వూరు మండలంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పర్యటించారు. కొలగుట్ల వరదల్లో చిక్కుకున్న 17 మందిని, ధర్మవరం చెరువులో చిక్కుకున్న 8 మందిని, చిత్రావతి నదిలో చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. పెన్నా నది వంతెన కింద చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు.