సమాజాన్ని తన కుటుంబంగా భావించి.. ప్రతి ఒక్కరి సంక్షేమం.. తన బాధ్యత అనుకుని.. అందుకోసం శ్రమించేవాడు.. కష్టం వస్తే.. కన్నీళ్లు తుడిచేవాడు.. అండగా ఉంటానని హామీ ఇచ్చేవాడే.. అసలుసిసలు నాయకుడిగా గుర్తింపు పొందుతాడు. అతడి గుండెల్లో ప్రజల పట్ల ప్రేమ.. సమాజం పట్ల బాధ్యత.. కన్నీరు చూస్తే చలించిపోయే మంచి మనసు ఉండాలి. అంతేతప్ప.. పదవీ, అధికారాల మీద వ్యామోహం ఉండకూడదు. అలాంటి వాళ్లనే ప్రజలు నాయకులుగా ఎన్నుకుంటారు.. పది కాలాల పాటు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. అలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన ప్రవేశ పెట్టిన పలు పథకాలు నేటికి కూడా ఎన్నో ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇప్పటికి కూడా ప్రజులు ఆ మహానీయుడిని స్మరించుకుంటారు.
రాజశేఖర్రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి.. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే.. మరోవైపే సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి.. ఉపాధి కల్పనతో పాటు.. ప్రజల వద్దకే నేరుగా ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకున్నారు. విద్య, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ.. ఆ రంగాల అభివృద్ధికి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా పాలన సాగిస్తున్నారు సీఎం జగన్.
ముఖ్యమంత్రిగా విధుల నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో.. ఇక కష్టమంటూ.. తన దగ్గరకు వస్తే.. వారిని అదుకోవడంలో కూడా అదే చొరవ చూపిస్తారు సీఎం జగన్. అన్నా అన్న పిలుపు వినపడితే చాలు.. టక్కున ఆగిపోతారు. బాధితులను దగ్గరకు తీసుకుని.. వారి సమస్యలు ఏంటో కనుక్కుని.. వెంటనే స్పాట్లోనే వారి సమస్యను పరిష్కరిస్తారు. అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగ్గరకు సామాన్యులు చేరడం అనేది ఎంత కష్టమో అందరికి తెలుసు. కానీ ఏపీ సీఎం జగన్ విషయంలో మాత్రం ఇది తారుమారవుతుంది. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే.. ఆయనే వారి దగ్గరకు వచ్చి.. ఓదార్చి.. సమస్యను పరిష్కరిస్తారు. గతంలో పలువురు చిన్నారులకు వైద్య సాయం చేసిన జగన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఓ చిన్నారి వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఆ వివరాలు..
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం జగనన్న విద్యా దీవేన పథకం కింద నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ మదనపల్లెలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. సీఎం వస్తున్న దారిలో హమీదా అనే మహిళ ఏడాదిన్నర వయసున్న తన బిడ్డను చేతుల్లో ఎత్తుకుని.. జగనన్నా.. నా బిడ్డను కాపాడన్నా అని వేడుకుంది. ఆమెను గమనించిన సీఎం జగన్.. హమీదాను సభాస్థలి వద్దకు పిలిపించుకుని.. ఆమెకు వచ్చిన కష్టం గురించి అడిగి తెలుసుకున్నాడు.
ఈ సందర్భంగా హమీదా మాట్లాడుతూ.. ‘‘అన్నా నా కొడుకు పేరు షేక్ మహమ్మద్ అలీ. నా బిడ్డ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. తన తల రోజు రోజుకు పెరిగిపోతూ.. పెనుభారంగా మారింది. ఇప్పటికే వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించాం. బాబును పరీక్షించిన వైద్యులు.. తలకు ఆపరేషన్ చేయాలని.. అందుకు చాలా డబ్బు ఖర్చువుతుందని తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు మావి. వైద్యానికి అంత డబ్బు ఎక్కడ నుంచి తేగలం. నువ్వే మమ్మల్ని ఆదుకుని.. మా బిడ్డకు నూతన జీవితాన్ని ప్రసాదించు అన్నా’’ అని వేడుకుంది.
ఆమె బాధను అర్థం చేసుకున్న సీఎం జగన్.. చిన్నారి వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపాడు. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం.. లక్ష రూపాయలు.. అలానే చిన్నారి పేరు మీద 3 వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించాడు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గిరీషా హమీదాకు వెంటనే లక్ష రూపాలయ సాయం అందజేశారు. అంతేకాక చిన్నారికి స్విమ్స్లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. జగన్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.