దేశంలో కొత్తగా వస్తున్న ఒమిక్రాన్ కేసులు ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 33కేసులు ఉండగా తాజా మరో 5 కేసులు బయట పడ్డాయి.. కర్ణాటకలో మూడో కేసు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్, మహారాష్ట్ర ఒక్కో కేసు నమోదైయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. తాజాగా ఏపి సీఎం జగన్ ఇవాళ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు బయటకు రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు.
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నానితోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్గదర్శకాలు, ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చేలా శ్రమించాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్దేశించారు.
ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ, ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించేందుకు వీలుగా రాష్ట్రంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ కు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇక నుంచి మరింత కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని అధికారులకు జగన్ ఆదేశించారు.
ఇది చదవండి : దేశంలో తగ్గిన కేసులు.. భయపెడుతున్న ఒమిక్రాన్!