సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి కోసం సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంతేకాక సంక్షేమ పథకాల ద్వారా అందించే సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ.. అవినీతికి తావు లేకుండా పాలన కొనసాగిస్తున్నారు. తాజాగా మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్. దీని ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా లక్ష రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్. ఇంతకు ఆ పథకం ఏంటి.. ఎవరు దానికి అర్హులు వంటి పూర్తి వివరాలు..
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు , వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద లబ్ధిదారులకు అందించే లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని శుక్రవారం ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదు జమ చేస్తారు. గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహం చేసుకుని.. అర్హత ఉన్న వివిధ వర్గాలకు చెందిన యువతులకు ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు.. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది.
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద పేద యువతులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.1,20,000లు.. దివ్యాంగులకు అయితే ఈ పథకం కింద రూ.1.50 లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తారు. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. పెళ్లి అయిన 60 రోజుల్లోపు http://gsws-nbm.ap.gov.in ద్వారా అర్హులైన వారు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం అధికారులు దరఖాస్తులను పరిశీలించి.. పూర్తి స్థాయిలో విచారించి.. అర్హుల జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత వారికి ఆర్థిక సాయం అందజేస్తారు.
అలాగే రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలతో పాటూ ఇతర వివరాలను.. గ్రామ, వార్డు సచివాలయాలకు తీసుకెళితే.. అక్కడ డిజిటల్ అసిస్టెంట్(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (డబ్ల్యూడీపీఎస్)లు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. వరుడుకి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు వయస్సు పూర్తి కావాలి. వధూవరులు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉంది. బాల్య వివాహాలను అరికట్టేందుకు, చదువును ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం.. పదో తరగతి తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చింది.