రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో.. సరికొత్త పథకాలతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు.. అందరికి వర్తించేలా.. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నాలుగేళ్ల కాలంలో మొత్తం 75 వేల రూపాయల మొత్తాన్ని అందజేయనున్నారు. దీనిలో భాగంగా ప్రతి ఏటా అర్హులైన మహిళల ఖాతాలో 18,750 రూపాయలు జమ చేస్తున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలో వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత కింద రాష్ట్రంలోని.. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 18,750 రూపాయల సాయాన్ని అందజేయనున్నారు. నేడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి అకౌంట్లలో జమ చేయయనున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా 14,110.62 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ మూడేళ్ల కాలంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున అందించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందించిన నిధులతో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ప్రతి మండలానికి ఒక వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందిస్తున్నారు. కొందరు లబ్ధిదారులు కిరాణా షాపులు నడుపుకుంటున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి నేడు కుప్పంలో పర్యటించనున్నారు. అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొని.. వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు విడుదల చేస్తారు. ఆ తర్వాత కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభించనున్నారు. మరి సీఎం జగన్ కుప్పం పర్యటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.