తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని విషాదాలు వదలడం లేదు. పాదయాత్ర రోజున తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. దీన్నుంచి బయటపడక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు ప్రాణ స్నేహితుడు, టీడీపీ సీనియర్ నేత, తిరుపతి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కందాటి శంకర్రెడ్డి కన్నుమూశారు. ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన తుదిశ్వాస విడిచారు. శంకర్రెడ్డి కొద్ది రోజుల క్రితమే గుండెకు సంబంధించిన సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ.. చివరకు ఆదివారం తుది శ్వాస విడిచారు. ఇక శంకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు.
శంకర్ రెడ్డి మృతి నేపథ్యంలో.. స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఆయన నివాసంలో టీడీపీ నేతలు, అధికార పార్టీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి పరసారత్నం తదితరులు శంకర్రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఇక ప్రాణ స్నేహితుడి మృతి పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్విట్టర్ వేదికగా.. ‘‘తిరుపతి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కందాటి శంకర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన శంకర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ పోస్ట్ చేశాడు.
తిరుపతి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కందాటి శంకర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన శంకర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/jiB82D2AbM
— N Chandrababu Naidu (@ncbn) February 5, 2023
చంద్రబాబు నాయుడు, శంకర్ రెడ్డి ఇద్దరు కాలేజీ రోజుల నుంచి మంచి మిత్రులు. వీరిద్దరూ ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో.. ఒకే హాస్టల్లో ఉన్నారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక శంకర్ రెడ్డి.. 2002లో జరిగిన తిరుపతి మన్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. అలానే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుత్తూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు చేతిలో ఓడిపోయారు. అలానే 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శంకర్రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.