చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్లో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. శుక్రవారం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సదంర్భంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో.. అచ్చెన్నాయుడు.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. కుప్పం ఎస్సై శివ కుమార్ ఫిర్యాదు చేశాడు. దాంతో అచ్చెన్నాయుడిపై కేసు నమోదయ్యింది. పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారని ఈ ప్రసంగంపై ఎస్ఐ ఫిర్యాదు చేశారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక కుప్పం సభలో అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు మోసపోతున్నారని.. అక్రమాలు, అన్యాయాలకు గురవుతున్నారని.. మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆరోపించాడు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి.. ఆవేదనతో నారా లోకేష్ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పాదయాత్ర ప్రారంభించారని తెలిపాడు. వైసీపీ మూడున్నరేళ్లలో పాలనలో రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా లేరని.. ప్రజలంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అన్నాడు అచ్చెన్నాయుడు.
అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో అనే భయాందోళనలో ప్రజలు వణికిపోతున్నారన్నారు అచ్చెన్నాయుడు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు యువత కదం తొక్కాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చాడు. నేడు 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఒకవైపు.. జగన్ ఒక వైపు ఉన్నారన్నాడు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారో.. 5కోట్ల ఆంధ్రులు గెలుస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నాడు అచ్చెన్నాయుడు. రానున్న ఎన్నికల్లో.. టీడీపీ 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవుతాడని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశాడు.
అంతేకాకుండా ఈ ఎన్నికల సమయంలో.. పోలీసులతో పనిలేకుండా టీడీపీ కార్యకర్తలే సైనికులుగా క్రమశిక్షణతో పని చేస్తూ.. టీడీపీ అధికారంలోకి రావడానికి పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాడు. అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.