ఆంధ్రప్రదేశ రాష్ట్ర రాజకీయాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న యువనేతల్లో బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి ఒకరు. తనదైన మాటలతో ప్రజలను ఆకట్టుకునే నైజం బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. అందుకే ఆయనకు ఉన్న క్రేజ్ ను పార్టీ నాయకులు కూడా ఉపయోగించకుంటారు. వైసీపీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్న సిద్దార్థ్ రెడ్డిని పిలిపించి సభలను సక్సెస్ చేస్తుంటారు. ఆయన కూడా పార్టీ కోసం తరచూ సభలో పాల్గొంటుంటారు. తాజాగా కర్నూలు వేదికగా జరుగుతున్న రాయలసీమ గర్జన సభకు కూడా సిద్దార్థ్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సభలో ఆయన కొంచెం అస్వస్థకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా కళ్లు తిరిగిపడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వికేంద్రీకరణకి మద్దతుగా కర్నూలు లోని ఏస్టీబీసీ కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన సభ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రజలు, మేధావులు, విద్యా వేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైయస్ఆర్ సీపీ నేతలు రాయలసీమ గర్జన సభ కు తరలి వచ్చారు. రాయలసీమకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. ఇదే సమయంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భాగా ఆయన కొద్ది సమయం పాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. “శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులు ఎంతో త్యాగం చేశారు. రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉంది. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి” అంటూ ప్రసంగించారు. సభలో మాట్లాడిన తరువాత ఆయన ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన ఆయనను చూసి సభలో ఉన్నవారు షాక్ అయ్యారు. అక్కడే ఉన్న వైసీపీ నేతలు.. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. అయితే డీహైడ్రేషన్ కారణంగా ఆయన కళ్లు తిరిగిపోయినట్లు తెలుస్తోంది. విరామం లేకపోవడంతో అలసిపోయి పడిపోయి ఉంటారని మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.