సాగరతీరంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటాయి. తాజాగా విశాఖ బీచ్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుని.. పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వివరాలు..
ఈ విశాల విశ్వంలో మనకు తెలియని.. అంతుచిక్కని రహస్యాలు ఎన్నో. కొన్నింటిని శాస్త్రీయంగా వివరించగలం. కానీ చాలా సందర్బాల్లో సైన్స్ను మించిన బలమైన కారణమేదో ఉంటుంది. అలాంటి అద్బుతాలను శాస్త్రీయంగా వివరించలేం. వాటిని చూసి ఆనందించాలి.. ఆస్వాదించాలి. తాజాగా విశాఖపట్టణంలోని భీమిలి బీచ్లో ఇలాంటి అద్భుతం ఒకటి ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు. మరీ ఇంతకు ఏం అద్భుతం చోటు చేసుకుంది.. జనాలు ఎందుకు అంతలా తరలి వస్తున్నారు అంటే..
విశాఖ సాగర తీరంలో.. అలలు సరికొత్తగా నీలి కాంతిలో సవ్వడి చేశాయి. భీమిలి బీచ్ పరిధిలో.. రాత్రి సమయంలో.. ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమై.. జనాలను అబ్బుర పరుస్తోంది. కైలాసగిరి నుంచి భీమిలి వరకు సాగర తీరంలో కొన్ని రోజులుగా అలలు నీలం వర్ణంలో మెరిసిపోతున్నాయి. వీటిని సందర్శించడానికి వచ్చిన జనాలు.. ఫొటోలను సోషల్ మీడియాలోషేర్ చేయడంతో.. నెట్టింట వైరల్గా మారాయి. అయితే తొలుత ఇలా నీలం అలలు కనిపించినప్పుడు జనాలు తీవ్ర భయభ్రాంతులకు గురి అయ్యారు. అయితే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని.. సాగర తీరంలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుందని అధికారులు చెప్పడంతో జనాలు, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇలా అలలు నీలి వర్ణంలో మెరిసిపోవడాన్ని బయోల్యూమినిసెన్స్ తరంగాలు అంటారు. కేరళలోని కొచ్చి సాగర తీరంలో.. జూన్, జూలై, ఆగస్లు నెలల్లో నీలి అలుల ఎక్కువగా కనిపిస్తుంటాయి అని తెలిపారు. అయితే తూర్పు తీరంలో ఇలా నీటి అలలు కనిపించడం ఇదే ప్రథమం అంటున్నారు. ఇవి మరో రెండు వారాలపాటు కనిపిస్తాయని చెబుతున్నారు అధికారులు. ప్లాంక్టన్ అని పిలిచే చిన్నచిన్న సముద్ర జీవులు విడుదల చేసిన రసాయనాల కారణంగా నీలి కాంతి విడుదలవుతుంది. ఫలితంగా అలలు ఇలా నీలం రంగులో మెరుస్తుంటాయని చెబుతున్నారు. సముద్రంలో ఆల్గే ఎక్కువగా పెరగడం వల్ల బయోల్యూమినిసెన్స్ వస్తాయంటున్నారు. ఆల్గేలో జరిగే ఒక రసాయన చర్య వల్ల నీలి రంగు వస్తుంది అంటున్నారు. అలాగే కొన్ని ఆల్గేల వల్ల బీచ్లు ఆకుపచ్చ వర్ణంలోనూ మెరుస్తుంటాయట.
ఇక మనదేశంలో చాలా సముద్ర తీరాల్లో ఇలా రంగురంగుల కాంతిలో మెరిసే అలలు కనిపించడం ఇదే ప్రథమం కాదు అంటున్నారు అధికారులు. లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర, మాల్దీవులు, చెన్నై వంటి చోట్ల ఈ తరహా నీలి అలలు తరచుగా దర్శనం ఇస్తాయి. అయితే ఈ ప్లాంక్టన్ సముద్ర జీవులు ఎక్కువగా అభివృద్ధి చెందితే.. సముద్ర జలాల్లో ఆక్సిజన్ తగ్గి.. సాగర జలాల్లోని జీవరాశులకు ప్రమాదకరంగా మారడమే కాక చేపలు వంటివి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు అధికారులు. కారణాలే ఏవైనా కానీ.. నీలి రంగు అలలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.