అన్స్టాపబుల్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే నంబర్ వన్ టాక్ షోగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సీజన్ 2కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈసారి అన్స్టాపబుల్ సీజన్ని కాస్త కొత్తగా ప్లాన్ చేసినట్లు అర్థమైపోతోంది. కేవలం సినిమాల నుంచే కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా షోకి అతిథులుగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు, లోకేశ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బాలయ్య స్నేహితుడు కిరణ్ కుమార్రెడ్డి అతిథిగా విచ్చేశారు. మరో అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, ప్రస్తుత రాజసభ్య సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
సాధారణంగానే షోలో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇంక వచ్చింది మిత్రులు కావడంతో షో మొత్తాన్ని ఒక ఊపు ఊపేశారు. అప్పట్లో వారి మధ్య జరిగిన ఫన్నీ సంఘటనలను ప్రస్తావించారు. కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు బాలయ్య చేసిన పనిని గుర్తుచేసుకున్నారు. స్పీకర్ అయినరోజు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి అధ్యక్షా నా మైక్ కట్ చేశారు.. అంటూ బాలయ్య చెప్పినట్లు కిరణ్కుమార్ రెడ్డి వెల్లడించారు. సీఎం అవడంపై ప్రశ్నించగా.. ‘నేను బతికున్నా కాబట్టే సీఎం అయ్యాను’ అంటూ కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి గురించి కూడా ప్రస్తావించారు. ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ బాలయ్య కూడా ఎమోషనల్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఒక గొప్ప నాయకుడు అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.