సంప్రదాయాలు, ఆచారాలు పాటించడంలో తెలుగు వారు ముందుంటారు. ఇక అతిథి మర్యాదల విషయంలో తెలుగు వారి తర్వాతనే ఎవరైనా. ఇక కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో రేంజ్లో ఉంటాయి. మరీ ముఖ్యంగా దసరా, సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్లను అత్తగారింటికి తీసుకెళ్లి.. వారికి ఓ రేంజ్లో మర్యాదలు చేస్తుంటారు. ఇక విందులో ప్రత్యేక వంటకాలు, రకరకాల ఆహారాపదార్థాలు, స్వీట్లు, నాన్ వెజ్ ఇలా రకరకాల పదార్థాలుంటాయి. మరీ ముఖ్యంగా ఏపీలో కొత్త అల్లుళ్లకు అత్తింటివాళ్ల విందులో పెట్టే పదార్థాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగాల్సిందే. తాజాగా ఏపీలో కాబోయే కొత్తల్లుడికి అత్తింటివారు ఇచ్చిన విందు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది. ఆ వివరాలు..
విజయనగరం జిల్లాకు చెందిన ఓ కుటుంబం కాబోయే అల్లుడికి కళ్లు చెదిరే విందు ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్భంగా కాబోయే అల్లుడిని ఆహ్వానించి ఏకంగా 125 రకాల వంటకాలతో విందు భోజనం పెట్టారు. ఎస్.కోటకు చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చైతన్యకు విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయం అయ్యింది. ఇక నిహారిక, చైతన్యల వివాహానికి 2023, మార్చి 9న ముహూర్తం నిర్ణయించారు.
ఈ క్రమంలో నిహారిక, చైతన్యకు నిశ్చితార్థం అయ్యాక తొలి పండగ కావడంతో.. దసరాకు అల్లుడిని తమ ఇంటికి ఆహ్వానించారు శ్రీనివాసరావు దంపతులు. పండుగ కావడంతో రకరకాల వంటకాలతో కాబోయే అల్లుడికి విందు ఏర్పాటు చేశారు. 95 రకాల వంటకాలు బయట నుంచి కొనుగోలు చేయగా.. మిగిలినవి ఇంట్లోనే తయారు చేశారు. ఏదో మామూలు విందు అనుకుంటే.. ఇదేందిరా నాయనా ఇన్ని వంటలున్నాయి అంటూ ఆశ్చర్యపోయాడు చైతన్య. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అత్తింటివారు ఏర్పాటు చేసిన విందులో కొన్నివంటల పేర్లు కూడా చైతన్యకు తెలియవట. మొత్తానికి కాబోయే అల్లుడికి పండుగకు ఇచ్చిన విందు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది.