AP: అభివృద్ధిలోనూ.. పెట్టుబడుల ఆకర్షణలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే సత్తా చాటుతోంది. ఇండియాలో అత్యంత స్పీడుగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీ అవతరించింది. 2021-22లో రెండంకెల వృద్ధి రేటుతో ఏపీ.. భారత్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తాజాగా, కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నివేదిక విడుదల చేసింది. 2021-22లో దేశ జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం కాగా.. ఏపీ వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మూడేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. 2022 జనవరి నుంచి జూలై వరకు పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 2022లో మొదటి 7 నెలల్లో దేశ వ్యాప్తంగా 1,71,285 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా.. ఒక్క ఏపీలోనే రూ.40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఇక, నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని కల్వతల గ్రామంలో తాజాగా, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ ద్వారా 1,790 కోట్ల రూపాయల పెట్టుబడి చేకూరింది. ఈ ప్రాజెక్టుతో 1,045 స్థానిక ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. మరోవైపు 2021-22లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధిరేటులోనూ ఏపీ నెంబర్ స్థానం సంపాదించి తన మార్కును చూపెట్టింది. అంతేకాదు! ప్రభుత్వం ప్రజా, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డును సొంతం చేసుకుంది. ప్రభుత్వం తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు.